బడ్జెట్: మహిళలకు వరం, కొత్తగా 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది కొత్తగా 8 కోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకొందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
ఉజ్వల పథకం కింద 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించనున్నట్టు జైట్లీ ప్రకటించారు. మహిళల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు గాను కొత్తగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఎన్నికలను పురస్కరించుకొని మహిళలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఈ మేరకు వ్యవహరించి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గత బడ్జెట్లలోనూ జైట్లీ ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను పెద్ద ఎత్తున పేద మహిళలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటిస్తూ వచ్చారు. అయితే మహిళల వంటింటి బడ్జెట్ పెరుగుతున్న క్రమంలో గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణను మాత్రం జైట్లీ ప్రస్తావించకపోవడం గమనార్హం.
దిగువ తరగతి ప్రజలకు ఈ ఏడాది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 50 లక్షల ఇళ్ళను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. కొత్తగా 2కోట్ల మరుగు దొడ్లు నిర్మించి ఇస్తామని జైట్లీ ప్రకటించారు,.