'సాక్ష్యాధారాలు చూపిస్తే మంత్రిపై విచారణకు సిద్ధం'
ముంబై: పల్లీ పట్టీల కుంభకోణంలో మహారాష్ట్ర మంత్రి పంకజ ముండేపై విచారణ జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
తమ ప్రభుత్వం అవినీతికి పూర్తిగా వ్వతరేకమని, మహారాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండేపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి తగిన సాక్ష్యాధారాలను చూపిస్తే.. ఆమెపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నాని చెప్పారు.
గిరిజన విద్యార్ధులకు సరఫరా చేసే పుస్తకాలు, ఇతర సామాగ్రి కొనుగోలులో టెండర్లు పిలవకుండానే రూ. 206 కోట్ల అవినీతి జరిగినట్లు పంకజ ముండేపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆమె ఆమోదం తెలిపిన 24 కాంట్రాక్టుల ద్వారా ఈ అవినీతికి పాల్పడ్డట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు పంకజ ముండేను గురువారం కోరారు. ఈ మేరకు మంత్రికి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక లేఖ రాశారు. ఇటీవల అహ్మాద్ నగర్ జిల్లాలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన పల్లిపట్టీలు నాసిరకంగా ఉన్నాయని, అవి విద్యార్ధులు తినడానికి యోగ్యంగా లేవని ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది.
దీనిపై మంత్రి స్పందించక పోవడంతో ఆమె అవినీతికి పాల్పడ్డారంటూ మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. దీంతో గిరిజన పాఠశాలలకు పుస్తకాలు, వాటర్ ఫిల్టర్లు, తినుబండారాల కోనుగోలలో తానెలాంటి అవకతవకలకు పాల్పడలేదని పంకజ ముండే పేర్కొన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు.