ఇదే చివరి లాక్ డౌన్- ఇప్పటికే లక్ష్యం నెరవేరింది- కేంద్రం సంకేతాలు...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ ఇప్పటికే నాలుగో విడత కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మే 31 తర్వాత లాక్ డౌన్ ఉండబోదని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా కరోనాపై పోరులో భాగస్వాములు కావాలని, ఆ మేరకు ప్రభుత్వం వారిని సంసిద్ధుల్ని చేస్తుందని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ పాల్ ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ వెల్లడించారు.
Recommended Video
ఒక్కరోజులో అత్యధిక కరోనా కేసులు.. సీఎం విజయన్ కీలక సూచనలు..
ఇదే చివరి లాక్ డౌన్..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించింది. ప్రజలు రోడ్లపైకి రావడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించిన నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేసింది. కేంద్రం సూచనల మేరకు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ను విధిగా అమలు చేశాయి. అయితే తాజాగా మారిన పరిస్ధితుల్లో లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తి కావడం, ఆర్ధిక వ్యవస్ధలు పతనమవుతున్న తీరు, ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకుని సడలింపులు ఇచ్చిన కేంద్రం.. మే 31 తర్వాత దీన్ని పూర్తిగా ఎత్తేయనుంది. ఇదే విషయాన్ని కోవిడ్ 19పై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ వీకే పౌల్ న్యూస్ 18తో ఇంటర్వూలో స్పష్టం చేశారు.
లక్ష్యం నెరవేరిందని ప్రకటన...
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన నాలుగు విడతల లాక్ డౌన్ తో లక్ష్యం నెరవేరినట్లేనని నీతి ఆయోగ్ సభ్యుడు కూడా అయిన డాక్టర్ వీకే పౌల్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ ను ఎల్లకాలం కొనసాగంచలేమని, ఓ లక్ష్యంతో దాన్ని విధించామని, అది ఇప్పుడు నెరవేరినట్లే భావిస్తున్నట్లు పౌల్ వెల్లడించారు. లాక్ డౌన్ వల్ల భారీగా కేసులు పెరగకుండా అడ్డుకోవడమే కేంద్రం లక్ష్యంగా దీన్ని బట్టి తెలుస్తోంది. ఈ ప్రకటనతో కేంద్రం లాక్ డౌన్ మళ్లీ పొడిగిస్తుందా లేదా అన్న అనుమానాలకు తెరపడినట్లయింది.
లాక్ డౌన్ విధించకుంటే ఏం జరిగేది ?
దేశంలో లాక్ డౌన్ విధించకపోతే కేసుల సంఖ్య లక్షల్లో ఉండేదని, మరణాలు కూడా భారీగానే ఉండేవని కేంద్రం అంచనా వేస్తోంది. దేశంలోని శాస్త్రవేత్తల అంచనా ప్రకారం లాక్ డౌన్ లేకపోతే 15.6 లక్షల కేసులు నమోదై ఉండేవని, 51 వేల మరణాలు సంభవించేవని అంచనా వేసినట్లు కేంద్రం చెబుతోంది. లాక్ డౌన్ కు ముందు దేశంలో కరోనా వృద్ధి రేటు 22 శాతంగా ఉందని, దాన్ని లాక్ డౌన్ విధింపుతో 5.5 శాతానికి తీసుకొచ్చినట్లు టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ పౌల్ స్పష్టం చేశారు. తద్వారా 14 నుంచి 29 లక్షల కేసులను తగ్గించగలిగినట్లు పేర్కొన్నారు.
దేశంలో గరిష్టానికి చేరిన కేసులు..
కేంద్ర ప్రభుత్వం మే 31 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసేందుకు సిద్దమవుతున్న వేళ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా ఒక్క రోజులో గరిష్టంగా 6 వేలుగా నమోదైంది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమయ్యాక దేశంలో ఇదే అత్యధికం. ఇందులో 60 శాతం ముంబయి, అహ్మదాబాద్, పూణే, ఢిల్లీ, కోల్ కతాలోనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేతకే మొగ్గుచూపుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.