అన్నా దీక్ష: లోక్పాల్ బిల్లు తెస్తామని ప్రభుత్వం
ముంబై: సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి జన్ లోక్పాల్ బిల్లు కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా రాలెగావ్సిద్ది గ్రామంలోని యాదవ్ బాబా ఆలయంలో ఆయన మంగళవారం నిరవధిక నిరశన దీక్ష ప్రారంభించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జన్ లోక్పాల్ బిల్లును ఆమోదించాలని హజారే డిమాండ్ చేశారు.
దీక్షా శిబిరం వద్ద జన్తంత్ర మోర్చ పేరుతో నూతన బ్యానర్ను ఏర్పాటు చేశారు. జన్ లోక్పాల్ బిల్లుపై యూపిఏ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని ఈ సందర్భంగా అన్నా అన్నారు. కాగా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం తాము లోక్పాల్ బిల్లు ఆమోదానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
కేంద్రమంత్రి వి నారాయణస్వామి మాట్లాడుతూ.. డిసెంబర్ 20లోపు ముగిసే పార్లమెంటు సమావేశాల్లోనే లోక్పాల్ బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా బిల్లు పార్లమెంటులో ఆమోదించే వరకూ తన దీక్షను కొనసాగిస్తానని అన్నా హజారే ప్రకటించారు.
లోక్పాల్ బిల్లు విషయమై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాశానని, ఆయన మాట నిలుపుకోకపోవడంతో నిరాశ చెందానని అన్నా హజారే ఇటీవల చెప్పారు. అవినీతి కేసులలలో స్వతంత్రత కలిగిన బృందంతో విచారణ జరిపే ప్రజా విచారణ చట్టమే జన్ లోక్పాల్ బిల్లు. గతంలో కూడా అన్నా హజారే ఢిల్లీ వేదికగా లోక్పాల్ బిల్లు కోసం పోరాటం కొనసాగించారు.