రూ. 6 లక్షలకు మించి నగలు కొన్నారా? కేంద్రం కంటికి చిక్కినట్లే!
న్యూఢిల్లీ: నల్లధనం చలామణిని, మనీలాండరింగ్ను అరికట్టేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా రూ. 6 లక్షలకుపైగా విలువైన కొనుగోళ్లపై నిఘా వేసింది.
ఎవరైనా రూ.6 లక్షలకు పైగా నగలు లేదా విలాస వస్తువులను కొనుగోలు చేస్తే, ఆ లావాదేవీలను విచారించాలని ఆదాయపు పన్ను శాఖతో పాటు రెవెన్యూ, ఇంటెలిజెన్స్ ఏజన్సీలను కేంద్రం ఆదేశించింది.
ఈ తరహా లావాదేవీలను పరిశీలించాలని, అవకతవకలు కనిపిస్తే, కేసులు పెట్టి విచారించాలని కేంద్ర నిఘా విభాగాల అధికారులకు ఆదేశాలు అందాయి. బినామీ లావాదేవీలు నిర్వహిస్తూ, అక్రమంగా డబ్బు చలామణి చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది.
నగదు లావాదేవీలు రూ. 2 లక్షలకు మించరాదని, రూ. 50 వేలకు పైగా జరిపే లావాదేవీలకు పాన్ నంబరు తప్పనిసరని కేంద్రం గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ. 6 లక్షలకు మించిన అన్ని కొనుగోళ్లనూ పరిశీలించాలని అధికారులకు సూచించింది.
ఈ రూ.6 లక్షల కొనుగోళ్లు కేవలం బంగారు ఆభరణాలు, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్లకు సంబంధించినవి. అంతేకాదు, ఇక రూ. 50 లక్షలకుపైగా జరిపిన ఆస్తుల కొనుగోళ్లను కూడా ఐటీ శాఖ పరిశీలించనుంది.