ఫేస్బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికాలకు మరోసారి కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగంపై కేంబ్రిడ్జి అనలిటికా, ఫేస్బుక్ సంస్థలకు భారత ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులకు కేంబ్రిడ్జ్ అనలిటికా ఇచ్చిన సమాధానంలో స్పష్టత లేని నేపథ్యంలో కేంద్రం రెండు సంస్థలపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించింది.
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి పనులకు భారతీయుల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా నివారించేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారో చెప్పాలని ఫేస్బుక్ను కోరింది. సమాచారం దుర్వినియోగం చేసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని సూచించింది.
ఈ నోటీసులపై స్పందించేందుకు రెండు సంస్థలకు మే 10 వరకు కేంద్రం గడువు ఇచ్చింది. రాజకీయ పార్టీలు సహా వర్వేరు సంస్థలకు సేవలందించే కేంబ్రిడ్జి అనలిటికా ఎనిమిది కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు చోరీ చేసినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. భారత్లో 5లక్షల 62 మంది వినియోగదారులపై ఈ ప్రభావం పడిందని గతంలో కేంద్రం ఇచ్చిన తాఖీదులకు సమాధానంగా ఫేస్బుక్ తెలిపింది.