ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? ఎయిర్లైన్స్దా?: ‘మధ్య సీటు’పై కడిగిపారేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: విమానాల్లో మధ్య సీటును కూడా బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం పట్ల సుప్రీంకోర్టు.. కేంద్రం, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ప్రజల ఆరోగ్యం గురించి చింతిస్తున్నారా? లేక విమానయాన సంస్థ లాభాల గురించా? అని నిలదీసింది.
Recommended Video
వందేభారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు నడుపుతున్న ఎయిరిండియా అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీట్లను బుకింగ్ చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, వారి నుంచి అడ్వాన్స్ తీసుకోవద్దని సుప్రీం స్పష్టం చేసింది.
చైనాకు రిలీఫ్-ట్రంప్కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?
భుజం భుజం తాకేలా ప్రమాదం కాదా?
విమానాల్లో సామాజిక దూరం అవసరం లేదని కేంద్రం భావిస్తోందా? మార్గదర్శకాల్లో మాత్రం 6 అడుగుల దూరం పాటించాలని చెబుతున్నారు? ఇక్కడ ఎందుకు పాటించరు? అని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. భుజానికి భుజం తాకేలా సీట్లలో కూర్చోవడం చాలా ప్రమాదకరమని, ఇది ప్రభుత్వ నిబంధనలకు కూడా విరుద్ధమేనని వ్యాఖ్యానించిది.
ఇలా చేసినా కరోనా రాదని భావిస్తున్నారా?
కేంద్రం, డీజీసీఏ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పరీక్షలు పెంచామని, విమానాల్లో వచ్చిన వారిని క్వారంటైన్ కూడా చేస్తున్నామని.. విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా ఉంచడం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదని మెహతా వాదించారు. అయితే, కోర్టు మాత్రం ఆయన వాదనలను కొట్టిపారేసింది. బహిరంగ ప్రదేశాల్లో 6 ఫీట్లు దూరం ఉండాలని చెబుతున్న మీరే.. ఇక్కడ మాత్రం ఒక సీటు వదిలేయలేరా? అని నిలదీసింది. దీని వల్ల కరోనా రాదని మీరు ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించింది.
దేశీయ విమానాల్లోనూ మధ్య సీటు..
విమానాల్లో మధ్య సీటును వదిలేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై డీజీసీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే దేశీయ విమానాల్లో కూడా మధ్య సీటును వదిలేయాలని రెండు నెలలపాటు వదిలేయాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించడం అనేది సాధారణ విషయమే కాదా? అని పేర్కొంది.
ఎయిరిండియా కష్టాలూ మీవేనా?
దేశీయ విమానాల్లో మధ్య సీటును వదిలేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని ఇటీవల విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, మీరు డీజీసీఏ తరపున వాదిస్తున్నారా? ఎయిరిండియా తరపున వాదిస్తున్నారా? అని సొలిసిటర్ జనరల్ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అంతేగాక, ఎయిరిండియా కష్టాలు కూడా మీవే అనుకుంటున్నారా? అని నిలదీసింది. రెండూ ఒకటే అని మెహతా చెప్పగా.. వెంటనే సీజేఐ కాదని అన్నారు. కేంద్రం ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి పెట్టాలి కానీ.. విమానయాన సంస్థలపై కాదని స్పష్టంచేశారు.
ఇక ముందు అలా వద్దంటూ సుప్రీంకోర్టు..
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులందర్నీ తీసుకొచ్చేందుకు ఎయిరిండియా వద్ద ఎక్కువగా విమానాలు లేవని.. మధ్య సీటును వదిలేస్తే.. వారిని తీసుకురావడానికి మరింత సమయం పడుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఇప్పటికే మద్య సీట్లను చాలా మంది బుక్ చేసుకున్నారని తెలిపారు. అయితే, బుక్ చేసుకున్న సీట్లలో ప్రయాణికులను అనుమతించాలని, అయితే, ఇకముందు నడిపే విమానాల్లో మధ్య సీటును వదిలేయాలని కోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీట్లకు విమానయాన సంస్థలు బుకింగ్స్ చేపట్టవద్దని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని బాంబే హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.