అన్ని రకాల వీసాలను రద్దు చేసిన కేంద్రం, ఎన్నారైలపై ఆంక్షలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అనుమతించిన అన్ని రకాల వీసాలను మంగళవారం నిలిపివేసింది. కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది.
ఇప్పటికే కరోనా ముప్పుతో విమాన ప్రయాణాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా భారతదేశంలోనే చిక్కుకుపోయిన కొందరు విదేశీయుల వీసాలను మాత్రం మానవతా దృక్పథంతో పొడిగిస్తున్నామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరో ఆదేశం జారీ చేసింది.
అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఆరంభమయ్యాక 30 రోజుల వరకు ఈ గడువు ఉంటుందని వెల్లడించింది. ఇది ఇలావుంటే, జీవితకాలంలో ఎన్నిసార్లైనా ప్రవేశించేందుకు ప్రవాస భారతీయుల(ఓసీఐ)కు ఇచ్చిన వీసాలను సైతం నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే, ఇప్పటికే భారతదేశంలో ఉన్నవారు ఎన్నాళ్లైనా ఉండొచ్చని స్పష్టం చేసింది. దౌత్య, ఉపాధి, ఐక్యరాజ్యసమితి కార్యాలయాలు, ప్రాజెక్టుల కోసం ఇచ్చిన వీసాలకు సస్పెన్షన్ నుంచి మినహాయింపు ఉంటుందని కేంద్రం పేర్కొంది.