4.5 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేస్తున్న కేంద్రం, విలువ వెయ్యి కోట్ల పైమాటే
న్యూఢిల్లీ: జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ప్రభుత్వం ఇప్పటికే 4.5 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేయనుంది. ఒక్కో డోసుకు రూ. 200లు చెల్లించనుంది. 1.1 కోట్ల జబ్స్ కొనుగోలు ఆర్డర్ చేసింది.
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్త తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ 4.5 కోట్ల డోసులను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ. 200కు ఒక డోసు చొప్పున కొనుగోలు చేయనుంది. దీనిపై పన్నులు కూడా వేయనున్నారు. 1.1 కోట్ల డోసులను ఏప్రిల్ వరకు తీసుకోనుంది.
మంగళవారం ఉదయం నుంచి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(పుణె) నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాల ద్వారా కోవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరా చేశారు. సోమవారమే ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించిన చర్యలు పూర్తిచేసింది. జీఎస్టీ కలుపుకుని కోవిషీల్డ్ డోసు రూ. 210(రూ. 10 టాక్స్)కి అందనుంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరపున హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ సంస్థ ఈ వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. తొలి ఆర్డర్లో రూ. 231 కోట్ల విలువైన 1.1 కోట్ల డోసులు ప్రభుత్వానికి చేరనున్నాయి. ఇక మొత్తం 4.5 కోట్ల డోసులకు గానూ రూ. 1176 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి 1.1 కోట్ల డోసులు, భారత్ బయోటెక్ నుంచి 55 లక్షల డోసులను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిస్తోంది. తొలి 100 మిలియన్ల డోసులను ప్రభుత్వానికి రూ. 200 చొప్పున అందిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. అయితే, టాక్సులు కూడా కలుపుకుంటే రూ. 220 అవుతుందని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు రూ. 1000 విక్రయిస్తామని తెలిపారు. ఇక కోవాగ్జిన్ ధర రూ. 309.5గా ఉంది. 16.5 లక్షల వ్యాక్సిన్లను భారత్ బయోటెక్ ఉచితంగానే అందజేయనుంది. వ్యాక్సిన్ పోటీ నేపథ్యంలో ఒక డోసు ధర రూ. 206 ఉండనుందని అంచనా వేస్తున్నారు.