రైతుల నిరసనల్లో టుక్డే టుక్డే గ్యాంగ్: కఠిన చర్యలు తప్పవంటూ కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలను దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే టుక్డే టుక్డే గ్యాంగ్ పావుగా వాడుకుంటోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అంతేగాక, ఇలాంటివారిపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. బీహార్ బీజేపీ రాష్ట్ర వ్యాప్త కిసాన్ చౌపల్ సమ్మేళన్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు రైతులు తమ నిరసనను విరమించుకోమని అంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను గౌరవిస్తుంది. అదే సమయంలో రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న టుక్డే టుక్డే గ్యాంగ్ పని పడుతుందని అన్నారు. దేశ విచ్ఛిన్నకర శక్తులకు రైతుల ఆందోళనలో పాల్గొంటే సహించేది లేదని హెచ్చరించారు.
ఢిల్లీ, మహారాష్ట్రల్లో అల్లర్లకు కారణమైనవారే ఇప్పుడు రైతుల ఆందోళనను ఉపయోగించుకుంటున్నారని కేంద్రమంత్రి రవిశంకర్ ఆరోపించారు. పోలీసులు ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేశారని, వారిపై విచారణ కూడా జరుగుతోందని తెలిపారు. రైతుల ఆందోళనను ఆసరా చేసుకుని దేశ విచ్ఛిన్నకారులు కుట్రలు పన్నుతున్నారని, వారిని విడిచిపెట్టేది లేదని తేల్చిచెప్పారు.
Recommended Video
లెఫ్టిస్టులు, మావోయిస్టులు, ఇతరులు రైతుల ఆందోళనలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), మండి వ్యవస్థను కొనసాగిస్తుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. అయినా కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారా? అని మండిడ్డారు.