తుక్కుగా మారనున్న భారత కీర్తి "విరాటం"...అది లేకుండా మేమెక్కడంటున్న నేవీ
అది కొన్ని దశాబ్దాల పాటు భారత రక్షణ రంగానికి సేవలందించింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలంగా సేవలందించి యుద్ధనౌకగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఈ యుద్ధనౌకకు కాలం చెల్లిందంటూ మోడీ సర్కార్ స్క్రాప్కు అమ్మివేయాలని యోచిస్తోంది. సుదీర్ఘ కాలంగా నేవీకి తన సేవలందించిన ఈ యుద్ధనౌకను అమ్మొద్దంటూ చాలామంది నేవీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఆ యుద్ధనౌక ఏంటి.... భారత్కు ఎప్పటి నుంచి సేవలందిస్తోంది..?
దశాబ్దాలుగా సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్
ఐఎన్ఎస్ విరాట్.... భారత్ రక్షణ వ్యవస్థలో కొన్ని దశాబ్దాల పాటు సేవలందించిన యుద్ధ నౌక. ప్రస్తుతం ఈ యుద్ధనౌక పరిస్థితి కాలం చెల్లిందంటూ దీన్ని విడిభాగాలు వేరు చేసి అమ్మాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై పలువురు మాజీ నేవీ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని వారసత్వ సంపదగా ప్రకటించాలని చెబుతున్నారు. ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ను స్క్రాప్కు ఇచ్చేశారు. ఇప్పుడు ఐఎన్ఎస్ విరాట్ను కూడా స్క్రాప్కు పంపడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సముద్రపు మహారాణిగా పిలువబడే ఐఎన్ఎస్ విరాట్పై పలు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు వచ్చాయని, అవి ఏవి సంతృప్తికరంగా లేవని రక్షణశాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పారు. ఐఎన్ఎస్ విరాట్ను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించలేమని చెప్పిన కేంద్ర మంత్రి... నేవీ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఐఎన్ఎస్ విరాట్ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సభలో తెలిపారు.
2017లో సేవలను ఉపసంహరించుకున్న ప్రభుత్వం
2019 ఎన్నికల సమయంలో ఐఎన్ఎస్ విరాట్ ప్రధానాంశాల్లో నిలిచింది. 1987లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుటుంబం ఐఎన్ఎస్ విరాట్లో విహారయాత్రకు వెళ్లిందని మోడీ సంచలన ఆరోపణలు చేశారు. 1959లో నవంబర్లో రాయల్ నేవీలో చేరింది.ఈ భారీ యుద్ధ నౌక అసలు పేరు హెఎంఎస్ హెర్మెస్ ఆఫ్ యూకే రాయల్ నేవీగా పిలిచేవారు. 27,800 టన్నుల బరువున్న ఈ యుద్ధ నౌక 1982లో జరిగిన ఫాక్ల్యాండ్స్ యుద్ధంలో బ్రిటీష్ నేవీలో కీలకంగా వ్యవహరించింది. ఆ తర్వాత మరమత్తులు చేశారు. అనంతరం భారత్ మే 12, 1987లో దీన్ని కొనుగోలు చేసింది. 2017లో ఐఎన్ఎస్ విరాట్ సేవలను భారత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఇదీ ఐఎన్ఎస్ విరాట్ చరిత్ర
విరాట్ యుద్ధ నౌక పలు యుద్ధ విమానాలను మోసుకెళ్లింది. పలు హెలికాఫ్టర్లను తీసుకెళ్లింది. ఇక ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌక నుంచి టేకాఫ్ తీసుకున్న యుద్ధ విమానాలు 22,034 గంటలు పాటు పనిచేశాయని, ఇక సముద్రంలో విరాట్ 2,250 రోజులు ఉన్నిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 11 లక్షల కిలోమీటర్లు విరాట్ ప్రయాణించినట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1989లో జరిగిన భారత్ -శ్రీలంకలో శాంతి నెలకొనాలనే ప్రయత్నంలో ఆపరేషన్ జూపిటర్లో తన సేవలందించిడమే కాకుండా... 1999 కార్గిల్ యుద్ధం సమయంలో కూడా విరాట్ పాల్గొనింది. అమెరికా నేవీతో జరిగిన నేవీ ఎక్సర్సైజ్లో కూడా పాల్గొన్న విరాట్... ఫ్రెంచ్ నేవీ కార్యక్రమం వరుణ, ఓమన్ నేవీ ఎక్స్ర్సైజ్లో కూడా పాలుపంచుకుంది. ఇక చివరిసారిగా విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో విరాట్ కనిపించింది. ఆ తర్వాత 2013లో ఐఎన్ఎస్ విక్రమాదిత్య దీని స్థానంలో చేరింది.
ప్రభుత్వం నిర్ణయంపై మాజీ నేవీ అధికారులు అసంతృప్తి
స్క్రాప్కు అమ్మడాన్ని పలువురు రిటైర్డ్ నేవీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. విగ్రహాల కోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం విరాట్ సంరక్షణ కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టి వారసత్వ సంపదగా ప్రకటించొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాష్. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో వందల సంఖ్యలో గదులు, హెలీప్యాడ్ ఉన్న ఈ అద్భుతమైన నౌకను టూరిస్టు అట్రాక్షన్గా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. భారత నేవీకి ఇది దుర్దినం అని అన్నారు మరో రిటైర్డ్ వైస్ అడ్మిరల్ జగ్గీ బేడీ. కొన్ని చారిత్రక నౌకలను పరిరక్షించుకుందామనే ఆలోచన భారత ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరం అని అన్నారు. భవిష్యత్ తరాలకు ఐఎన్ఎస్ విరాట్ ఒక ఐకాన్గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.