గురువారం లోక్సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు..ఈ సారైనా పాస్ అవుతుందా..?
న్యూఢిల్లీ: లోక్సభలో గురువారం పలు బిల్లులను పాస్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో ప్రధానమైన బిల్లుగా ట్రిపుల్ తలాక్ బిల్లు ఉంది. ఇక గురువారం రోజున తమ ఎంపీలందరు సభలో ఉండాలని విప్ జారీ చేసింది అధికార బీజేపీ. ముస్లిం సామాజిక వర్గంకు చెందిన భర్తలు భార్యతో విడాకులు తీసుకోవాలంటే మూడు సార్ల తలాక్ అని సంబోధించి విడిపోతున్నారు. ఇకపై అలా చేస్తే దాన్ని నేరం కింద పరిగణించాలనే కొత్త చట్టంను మోడీ సర్కార్ తీసుకొచ్చింది. తద్వారా ముస్లిం మహిళలకు న్యాయం చేయాలని భావిస్తోంది.
మోడీ ప్రధానిగా రెండో సారి అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి లోక్సభ సమావేశాల్లో ఈ బిల్లు ముసాయిదాను రూపొందిచారు. ట్రిపుల్ తలాక్ చెప్పిన వారు చట్టపరంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. ఇక వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. విపక్షాల వాదనతో ఏకీభవించని ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చేందుకే మొగ్గు చూపింది. అంతేకాదు పురుషుడు స్త్రీ వేరుకాదని ఈ బిల్లు ద్వారా ఇద్దరిలో సమానత్వం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం వివరించింది. అంతేకాదు బిల్లు తీసుకురావడం వల్ల సామాజిక న్యాయం కూడా జరుగుతుందని వివరించింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు స్క్రూటినీ చేసేందుకు బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో అత్యధిక మెజార్టీ కలిగి ఉంది. కాబట్టి బిల్లును పాస్ చేయడం పెద్ద పనికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే రాజ్యసభలో మాత్రం బిల్లును పాస్ చేయించేందుకు ప్రభుత్వం కాస్త కష్టపడాల్సి వస్తుంది. సంఖ్యాపరంగా విపక్ష పార్టీలు ఎక్కువున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షం అయిన జేడీయూ కూడా బిల్లుపై సంతృప్తితో లేనట్లు సమాచారం.