ఒకే దేశం..ఒకే కార్డు: దేశవ్యాప్తంగా బస్సుల్లో రైళ్లల్లో ప్రయాణించేందుకు త్వరలో స్మార్ట్ కార్డు
ఢిల్లీ: ఇప్పటి వరకు ఒక దేశం ఒక ఎన్నిక అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదే పద్ధతిలో ప్రజారవాణా సంస్థలో ఒకే దేశం ఒకే స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. ప్రజా రవాణా వ్యవస్థలో ఇప్పటి వరకు ఇలాంటి ఒకే కార్డు పద్దతిని సింగపూర్ లండన్లలో అమల్లో ఉంది. సింగిల్ స్మార్ట్ కార్డు వివిధ రకాల ప్రజా రవాణా వ్యవస్థలను అనుసంధానం చేస్తుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. అంతేకాదు ఈ స్మార్ట్ కార్డు ద్వారా ప్రజలు బస్సుల్లో, మెట్రోల్లో, సబర్బన్ రైళ్లలో ఎలాంటి రిస్క్ లేకుండా ప్రయాణించొచ్చు అని అమితాబ్ కాంత్ అన్నారు.
దేశ ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకగా ప్రజారవాణా వ్యవస్థ
ఏదేశ ఆర్థిక అభివృద్ధికైనా వెన్నెముక ఆదేశ ప్రజారవాణా వ్యవస్థే. ఎక్కువ జనాభా ఉన్న భారత్ లాంటి దేశాల్లో రవాణా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి దేశాల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టం అత్యంత కీలకం. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందుకే వాహనాల కంటే ముందు పౌరులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అమితాబ్ కాంత్ అన్నారు. ఇందులో భాగంగానే వారి ప్రయాణం సుఖవంతం చేయాలన్న మంచి ఉద్దేశంతో ఒకే కార్డు విధానాన్ని ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. రవాణా వ్యవస్థలో భారత్ మరో అడుగు ముందుకేయనుందని అమితాబ్ కాంత్ అన్నారు. ఒక్క రవాణా వ్యవస్థే భారతదేశ జీడీపీకి 4శాతం దోహదం చేస్తోంది. ఇందులో ఎక్కువగా ఇంధనం రవాణాపైనే ఆధారపడి ఉంది.
డిజిటైజేషన్ దిశగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టం
రవాణావ్యవస్థపై పూర్తి దృష్టి సారించినట్లు నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. ప్రజలకు సురక్షిత ప్రజా రవాణా అందించేందుకు ముందడుగు వేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ప్రజా రవాణా వ్యవస్థను డిజిటైజేషన్ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఒక్క కార్డు ప్రయాణికులకు ఇచ్చి దీంతో ఎందులోనైనా ప్రయాణించగలిగే అవకాశం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అమితాబ్ కాంత్ తెలిపారు. అంతేకాదు ప్రజలు కూడా కాలుష్యం వెదజల్లే వాహనాలు కాకుండా కాలుష్య రహిత వాహనాలను అప్రోచ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రజారవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్, మిథనాల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, హైడ్రోజన్ ఫ్యూయెల్ బ్యాటరీలతో నడిచే వాహనాలు ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నట్లు అమితాబ్ కాంత్ తెలిపారు.
ఒక వాహనంపై ఇద్దరు ప్రయాణం చేయండి..కాలుష్యాన్ని అరికట్టండి
మరోవైపు భారత ప్రభుత్వం కాలుష్యరహిత వ్యవస్థ కోసం పనిచేస్తోందని చెప్పారు నీతి ఆయోగ్ సలహాదారుడు అనిల్ శ్రీవాస్తవ. ఇందులో భాగంగానే కాలుష్య రహిత వాహనాలను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందులో భాగంగా దేశ పౌరులు కూడా తమ బాధ్యతగా ఒకే వాహనంపై మరొకరిని ఎక్కించుకునేందుకు ముందుకు రావాలని తద్వారా ఒక వాహనం రోడ్డుపై తగ్గి దాన్నుంచి వచ్చే కాలుష్యం కొంతైన తగ్గించినవారమవుతామని ఆయన అన్నారు. భారత ప్రజారవాణా వ్యవస్థలో ప్రవేశపెట్టనున్న స్మార్ట్ కార్డు ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలంటూ పలు సంస్థలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు శ్రీవాస్తవ.