ఆధార్ డ్రైవింగ్ లైసెన్సుల అనుసంధానం తప్పనిసరి చేస్తాం: కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్
డ్రైవింగ్ లైసెన్సులను ఆధార్తో తప్పనిసరి అనుసంధానం చేస్తూ ఆ మేరకు త్వరలో చట్టం తీసుకొస్తామని చెప్పారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్. పంజాబ్లోని లవల్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో జరుగుతున్న 106వ జాతీయ సైన్సు కాంగ్రెస్ సదస్సులో ఆయన ప్రసంగించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి తప్పించుకుంటున్నాడని ఆ తర్వాత మరో డూప్లికేట్ లైసెన్సు పొందుతున్నాడని ఆయన పేర్కొన్నారు. దీంతో శిక్ష నుంచి తప్పించుకుంటున్నాడని మంత్రి చెప్పారు.
డ్రైవింగ్లైసెన్సులను ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల పేరు మార్చుకోవచ్చేమో కానీ బయోమెట్రిక్గుర్తులను మార్చలేమని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అదేమాదిరిగా ఐరిస్, చేతివేలి గుర్తులు మారవని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. డూప్లికేటు లైసెన్సు పొందాలని చూసినా.. అప్పటికే ఉన్న లైసెన్సు బయోమెట్రిక్, వేలిముద్రలు, ఐరిస్లు అనుసంధానం చేసి ఉంటాయి కాబట్టి దాని ద్వారా దొంగ దొరుకుతాడని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు వారధిగా నిలిచిందని చెప్పారు.
ఇక భారత డిజిటల్ ప్రొఫైల్ గురించి మంత్రి గణాంకాలను వెల్లడించారు. భారత్లో జనాభా 130 కోట్లు ఉందని చెప్పిన రవిశంకర్ ప్రసాద్...ఇప్పటి వరకు 123 కోట్ల ఆధార్ నెంబర్లు నమోదయ్యాయని, 121 కోట్ల మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారని, 44.6 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇందులో ఉన్నాయని, 56 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు, ఈ-కామర్స్లో 51 శాతం వృద్ధి చోటు చేసుకున్నాయని వివరించారు. 2017-18లో డిజిటల్ పేమెంట్స్ కూడా రూ.2070 కోట్లు జరిగాయని స్పష్టం చేశారు.