అమ్మాయిల కనీస పెళ్లి వయసుపై త్వరలో నిర్ణయం- ప్రధాని మోడీ వెల్లడి
దేశంలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో అమ్మాయిల పెళ్లి వయసు ఎంత ఉండాలనే అంశంపై ప్రస్తుతం అధ్యయనం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీస వయస్సును నిర్ధారించబోతోంది. ప్రస్తుతం అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయస్సుగా ఉంది. దీన్ని పెంచడం లేదా తగ్గించేందుకు కేంద్రం అధ్యయనం చేయిస్తోంది.
దేశంలో అమ్మాయిల కనీస పెళ్లి వయసును మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇదే అంశంపై దేశంలోని వివిధ ప్రాంతాల మహిళలు తనను ప్రశ్నిస్తూ లేఖలు రాస్తున్నారని ప్రధాని మోడీ ఇవాళ తెలిపారు. దీనిపై నియమించిన టాస్క్ఫోర్స్ అధ్యయనం జరుపుతోందని, దేశంలో ప్రస్తుత పరిస్ధితుల ఆధారంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని ఇవాళ వెల్లడించారు. దేశంలో బాలికల కోసం చేపడుతున్న పలు చర్యలను ఈ సందర్భంగా మోడీ గుర్తుచేశారు.
ఆహార వ్యవసాయ సంస్ద (ఎఫ్ఏఓ) 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 రూపాయల నాణాన్ని విడుదల చేసిన ప్రధాని.. దేశంలో బాలికలు, మహిళలకు పౌష్టికాహాన్ని అందించేందుకు కేంద్రం ఆరేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలను వెల్లడించారు. కేంద్రం చర్యల వల్ల ఆరేళ్లలో దేశవ్యాప్తంగా బాలుర కంటే బాలికల అక్షరాస్యత స్ధాయి పెరిగిందని మోడీ గుర్తుచేశారు. వీరి కోసం స్వచ్ఛభారత్లో భాగంగా దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని, పేద మహిళలకు రూపాయికే శానిటరీ ప్యాడ్లను సరఫరా చేస్తున్నామని మోడీ తెలిపారు.