హార్స్ ట్రేడింగ్ తప్పే, ఎక్కువ రోజులు ఉండదు, ఏడాది ఆగండి: కర్ణాటకపై అమిత్ షా
బెంగళూరు: అపవిత్ర కూటమితో ఏర్పడిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనలేవని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం అన్నారు. కర్ణాటకలో యడ్యూరప్ప రాజీనామా అంశంపై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలా యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటు కోసం మానిప్యూలేషన్ చేయలేదన్నారు.
చదవండి: ఇక చాలు, రాజీనామా చేయండి!: యడ్యూరప్ప తీరుపై అధిష్టానం ఆగ్రహం? రంగంలోకి బీజేపీ పెద్దలు
కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఎంతకాలం మనగడ సాగిస్తుందో తనకు తెలియదు కానీ, ఇలాంటి అపవిత్ర కూటములు దీర్ఘకాలం మాత్రం కొనసాగలేవన్నారు. కర్ణాటక ప్రజలు తమ పార్టీకే అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు.
కాంగ్రెస్ ఆ పని చేసింది
అత్యధికంగా 104 సీట్లు బీజేపీకి కట్టబెట్టారని అమిత్ షా గుర్తు చేశారు. జేడీఎస్తో జట్టు కట్టడం ద్వారా కాంగ్రెస్ దొడ్డి దారిన అధికారంలోకి వస్తోందన్నారు. యడ్యూరప్ప రాజీనామాతో మేం ఎవరినీ మభ్యపెట్టలేదని, కాంగ్రెస్సే ఆ పని చేసిందని స్పష్టమైందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన జేడీఎస్, ఏ కూటమి నీతిని అనుసరించి బీజేపీని అధికారానికి దూరం చేసిందో చెప్పాలన్నారు.
హార్స్ ట్రేడింగ్ కచ్చితంగా తప్పే
హార్స్ ట్రేడింగ్ కచ్చితంగా తప్పేనని, కాంగ్రెస్ మొత్తం బందెల దొడ్డినే కొనేసిందని పరోక్షంగా జేడీఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తప్పుదారి పట్టించిందని ఎద్దేవా చేశారు. బలపరీక్షలో బీజేపీ ఓడిపోవడంపై కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోందనే విషయంపై మాట్లాడుతూ.. ఓటమిని కూడా విజయంగా భావించడమనే కొత్త సిద్ధాంతాన్ని రాహుల్ పార్టీ అలవాటు చేసుకుంటోందన్నారు.
2019 లోకసభ ఎన్నికల్లో మేమే
బీజేపీకి 104 సీట్లు వస్తే, కాంగ్రెస్కు 78 సీట్లు మాత్రమే వచ్చాయని అమిత్ షా అన్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో ఆ కూటమికి తగిన బుద్ధి చెబుతారన్నారు. 2019లో జరిగే లోకసభ ఎన్నికల్లో కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్లో స్ఫూర్తిదాయకమైన విజయం సాధిస్తామన్నారు. దేశంలోని వ్యవస్థలను బీజేపీ ధ్వంసం చేస్తోందన్న రాహుల్ గాంధీ ఆరోపణలను సైతం అమిత్షా కొట్టిపారేశారు. బీజేపీని చూస్తే జాతి వ్యతిరేకశక్తులకు భయమేస్తోందన్నారు.
15 రోజుల సమయం అడగటం, ఎమ్మెల్యేలు వస్తారనే విషయమై
బలపరీక్షకు పదిహేను రోజుల గడువు అడగటంపై అమిత్ షా స్పందించారు. 15 రోజుల్లో 104ను 112 ఎలా చేస్తారని విపక్షాలు ప్రశ్నించాయి. దానికి షా స్పందిస్తూ... కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తే, వారి మైండ్ సెట్ మార్చుతారని, అప్పుడు తమ వైపు వస్తారన్నారు. వచ్చే ఏడాది జరిగే లోకసభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధిస్తామని, ఏడాది వేచి చూడండని చెప్పారు.