రాహుల్ గాంధీ రాజీనామా చేయడమంటే కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకున్నట్లే: లాలూ ప్రసాద్
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే ఆ పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. రాహుల్ రాజీనామా చేస్తే పార్టీ అంధకారంలోకి వెళ్లిపోవడమే కాదు..సంఘ్ పరివార్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారంతా కూడా తమ గళానికి తాళం వేయాల్సి ఉంటుందని లాలూ చెప్పినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక టెలిగ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది. రాహుల్ రాజీనామా చేస్తే చాలా మంది బీజేపీ వలలో పడిపోతారని లాలూ సూచించినట్లు సమాచారం.
ఎన్నికల్లో ఘోర పరాభవానికి మహాకూటమి సమిష్టి వైఫల్యమే కారణం
ఒకవేళ గాంధీ కుటుంబంకు కాకుండా మరొకరిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటిస్తే వారు గాంధీ కుటుంబం చేతిలో కీలుబొమ్మ అనే విమర్శలు ఎదుర్కొంటారని లాలూ చెప్పారు. రాహుల్ను విమర్శించే వారికి ఆయన ఈ అవకాశం ఎందుకు ఇవ్వాలని లాలూ ప్రశ్నించారు. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసిన లాలూ ప్రసాద్ యాదవ్... బీజేపీ నేతృత్వంంలోని ఎన్డీయే ఘనవిజయం సాధించడాన్ని మహాకూటమి సమిష్టి వైఫల్యంగా చూడాలని... ఓటమికి గల కారణాలపై సమీక్ష జరపాలని కోరారు. అంతేకాదు విపక్షపార్టీల్లో సమన్వయం కోల్పోయిందని ఇదే బీజేపీకి అస్త్రంగా మారిందని లాలూ అన్నారు. అంతేకాదు విపక్షాలు వ్యూహాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయని తెలిపారు.
ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం దెబ్బతీసింది
ఇక నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు విపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిగా సరైన వ్యక్తిని ఫోకస్ చేయడంలో విఫలమైనందునే ఇంతటి ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. అంతేకాదు విపక్షాలు ఒక సరైన పెళ్లికొడుకును ఎంచుకోవడంలో విఫలమైందని అందుకే బారాత్(ఊరేగింపు)వరకు చేరుకోలేకపోయిందని తనదైన శైలిలో సెటైర్లు వేశారు లాలూ ప్రసాద్ యాదవ్.
ప్రధాని అభ్యర్థిని ప్రకటించి ఉంటే ప్రజలకు స్పష్టత వచ్చేది
ఇక రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా మహాకూటమి ప్రకటించి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలు తమకు ఎక్కువ సీట్లు కావాలని బేరమాడటంలో తప్పులేదన్న లాలూ... వారు ప్రధాని అభ్యర్థిగా ఒక వ్యక్తిని ప్రకటింకపోవడం అతిపెద్ద తప్పుగా అభివర్ణించారు. ఎప్పటికైనా ఒక ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తేనే ప్రజల్లో కాస్త క్లారిటీ వస్తుందని తెలిపిన లాలూ ప్రసాద్ యాదవ్... ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లడంతో మహాకూటమిలోని పార్టీల్లోనే సమన్వయం లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైందన్నారు. ఇదే భారీ మూల్యం చెల్లించేలా చేసిందని లాలూ చెప్పారు.