కర్ణాటక మొదటి సీఎం కేసీ రెడ్డి, 70 ఏళ్లు, విగ్రహం లేదు: మనుమరాలి ఆమరణ నిరాహార దీక్ష !
కర్ణాటక మొదటి ముఖ్యమంత్రి కేసీ రెడ్డివిదాన సౌధ నిర్మాణానికి కారకులు, 70 ఏళ్లు అయ్యిందికేసీ రెడ్డి విగ్రహం మాత్రం లేదు, మనుమరాలి ఆమరణ నిరాహార దీక్ష
బెంగళూరు: కర్ణాటక మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీ. రెడ్డి (కే. చంగలరాయరెడ్డి) విగ్రహం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆయన మనుమరాలు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. బెళగావిలోని సువర్ణ విదాన సౌధలో కర్ణాటక శాసన సభా సమావేశాలు జరుగుతున్న సమయంలో కేసీ రెడ్డి మనుమరాలు కేసీ. వసంత కవితా రెడ్డి అక్కడే గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కర్ణాటక (మైసూరు రాష్ట్రం)కు కేసీ రెడ్డి మొట్ట మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1947 నుంచి 1952 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బెంగళూరులో విధాన సౌద నిర్మించడానికి కేసీ రెడ్డి బ్లూ ప్రింట్ తయారు చేయించారు.
కేసీ రెడ్డి అప్పటి దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఆహ్వానించి 1951 జులై 13వ తేదీ విదాన సౌధ నిర్మాణానికి భూమి పూజ చేయించారు. మచ్చలేని వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్న కేసీ రెడ్డి విగ్రహం విదాన సౌధ ముందు ఏర్పాటు చెయ్యాలని ఎన్నిసార్లు మనవి చేసినా సిద్దరామయ్య ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మనుమరాలు వసంత కవితా రెడ్డి ఆవేదన చెందుతున్నారు.
విదాన సౌధ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామని బెంగళూరులో రెడ్డి జన సంఘం సమావేశంలో ప్రభుత్వం హామి ఇచ్చిందని, ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదని కేసీ రెడ్డి మనుమరాలు వసంత కవితా రెడ్డి ఆరోపించారు.
కర్ణాటకకు మొదటి సీఎం అయిన కేసీ రెడ్డి విగ్రహం 70 ఏళ్లు అయినా ఏర్పాటు చెయ్యలేదని, ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలని వసంత కవితా రెడ్డి ప్రశ్నించారు. కేసీ రెడ్డి విగ్రహం ఏర్పాటు చెయ్యడానికి పనులు ప్రారంభించే వరకూ ఆమరణ నిరాహార దీక్ష విరమించనని వసంత కవితా రెడ్డి తేల్చి చెప్పారు.