చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
చెన్నై: రెండు రోజుల భారత పర్యటన కోసం చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నైకి చేరుకున్నారు. ఎయిర్ చైనాకు చెందిన ప్రత్యేక విమానంలో ఈ ఉదయం బీజింగ్ నుంచి బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు సంప్రదాయబద్ధమైన ఘన స్వాగతం లభించింది. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, అతి కొద్దిమంది అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సంస్కృతి ప్రదర్శనలను తిలకిస్తూ ముందుకు సాగారు. తమిళనాడు సంప్రదాయబద్ధమైన కళలను ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రదర్శించారు. విమానాశ్రయం ప్రధాన ద్వారం వద్ద అందుబాటులో ఉంచిన కారులో జిన్ పింగ్ గిండీ రోడ్డులోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ వెళ్లారు.
ఈ సాయంత్రం 4: 10 నిమిషాలకు జిన్ పింగ్ మామళ్లాపురానికి బయలుదేరి వెళ్తారు. చెన్నై నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర ప్రాంత పట్టణంలోనే నరేంద్ర మోడీ.. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ మధ్య శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. సాయంత్రం 5 గంటల సమయంలో మామళ్లాపురంలో ప్రధానమంత్రి స్వాగతం పలుకుతారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే గడుపుతారు. ఈ సందర్భంగా మామళ్లాపురం ఆలయాన్ని సందర్శిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు. రాత్రి 8: 10 నిమిషాలకు జిన్ పింగ్ చెన్నై గ్రాండ్ చోళ హోటల్ కు చేరుకుంటారు. మోడీ మామళ్లాపురంలోని ఓ రిసార్టులో బస చేస్తారు.
#WATCH Tamil Nadu: Chinese President Xi Jinping welcomed by folk dancers and musicians, upon his arrival at Chennai airport pic.twitter.com/HB37PVAyh9
— ANI (@ANI) October 11, 2019