పైసా లేకున్నా పార్లమెంటుకు.. ఇదీ ఒడిశా మోడీ కథ..
బాలాసోర్ : ఎన్నికల్లో గెలుపంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అదీ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టాలంటే కోట్లు ఖర్చుచేయక తప్పని పరిస్థితి. కానీ తన సేవతోనే ప్రజల అభిమానం సొంతం చేసుకున్న ఆయన ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రజాసేవకు జీవితం అంకింతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఎవరాయన? ఎక్కడుంటారు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవండి.
దక్షిణాదిపై పట్టు కోసం బీజేపీ ప్రయత్నం: తలైవాకు గాలం: కేంద్రంలో అనూహ్య పదవి?
నిరాడంబర జీవితం
ప్రతాప్ చంద్ర సారంగీ. బాలాసోర్ తాజా ఎంపీ. కుర్తా పైజామా. భుజాన ఓ బ్యాగు. సైకిల్పై ప్రయాణం. చూసిన వాళ్లెవరైనా ఆయన ఓ ప్రజాప్రతినిధి అంటే ఎవరూ నమ్మరు. పూరి గుడిసెలో ఉండే ఆయన పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాలాసోర్ లోక్సభ సీటు నుంచి బీజేపీ తరఫున బరిలో దిగి విజయం సాధించారు. బీజేడీ అభ్యర్థి రవీంద్ర కుమార్ జెనాపై 12,956 ఓట్లతో ఘన విజయం సాధించిన ఈయన ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్.
ఒడిశా మోడీ
ప్రతాప్ చంద్ర సారంగి తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారు. అందుకే అందరూ ఆయన్ని ఒడిశా మోడీ అని పిలుస్తారు. అవివాహితుడైన సారంగి.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా తన కోసం ఆయన దాచుకున్నదేమీ లేదు. ప్రజాప్రతినిధిగా తనకు వచ్చే జీతం, ఇతర నిధులను ప్రజోపయోగానికే వినియోగించారు. సైకిల్పై సుదూర ప్రాంతాలు ప్రయాణించి ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. అందుకే ఆయనంటే జనానికి విపరీతమైన అభిమానం. ప్రధాని మోడీ సైతం ఒడిశాకు వచ్చినప్పుడల్లా సారంగిని కలుస్తారంటే ఆయనకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన
ఉత్కళ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన సారంగికి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆదివాసీ ప్రాంతాలైన మయూర్ భంజ్, బాలాసోర్లలో ఎన్నో స్కూళ్లు స్థాపించి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. 2004, 2009లో నీలగిర్ స్థానం నుంచి గెలుపొందిన సారంగి.. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తన నిరాడంబర జీవితాన్నే కొనసాగిస్తున్నారు. 2014లో బాలాసోర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన... తాజా ఎన్నికల్లో దాదాపు 12వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టనున్నారు.