కంగనాకు భారీ షాక్- ముంబై ఫ్లాట్ అక్రమమని తేల్చిన కోర్టు- కూల్చివేత ఖాయం
ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న తన ఫ్లాట్ను బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కూల్చివేయకుండా అడ్డుకోవాలని కోరుతూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు చుక్కెదురైంది. ఫ్లాట్ నిర్మాణంలో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని గతంలో కార్పోరేషన్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కంగనా సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని తాజాగా కోర్టు తోసిపుచ్చింది.
ముంబైలోని ఖారా ప్రాంతంలో 16 అంతస్తుల భవనంలో ఐదో ఫ్లోర్లో కంగనాకు మూడు ఫ్లాట్లు ఉన్నాయి. వీటిని విడిగా నిర్మించేందుకు గతంలో పర్మిషన్ తీసుకున్న కంగనా.. అనంతరం వాటిని కలిపేసింది. సంక్ ఏరియా, డక్ట్ ఏరియా, కామన్ పాసేజ్ కలిపేసి ఫ్లీ ప్లోర్ స్పేస్ ఇండెక్స్ను హ్యాబిటబుల్ ఏరియాగా మార్చేశారని సివిల్ కోర్టు నిర్ధారించింది. ఇది తీవ్ర ఉల్లంఘన అని, దీనికి మున్సిపల్ కార్పోరేషన్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తేల్చింది.
వాస్తవానికి ఈ ఉల్లంఘనలకు సంబంధించి 2018 మార్చిలోనే బృహన్ ముంబై కార్పోరేషన్ కంగనాకు నోటీసులు జారీ చేసింది. తాము గతంలో ఆమోదించిన విధంగా ఫ్లాట్లో తిరిగి మార్పులు చేయాలని, లేదా నిబంధనలకు విరుద్ధంగా చేసిన మార్పులను కూల్చేస్తామని గతంలోనే హెచ్చరించింది. అయినా కంగనా పట్టించుకోలేదు. మహారాష్ట్రంలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి రెగ్యులరైజేషన్కు ప్రయత్నించారు.. అయినా కుదరకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు కూడా ఉల్లంఘనలు నిర్ధారించడంతో అధికారులు వీటి కూల్చివేతకు సిద్ధమవుతున్నారు.