మహా మలుపులు..! మహారాష్ట్ర గడ్డపై ఊహించని సీఎం..!!
ముంబాయి/హైదరాబాద్ : మరాఠా గడ్డపై రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత 13రోజులుగా ప్రభుత్వ ఏర్పాటులో తర్జన భర్జన పడుతున్న బీజెపి, శివసేన పార్టీలు ఓ కీలక నిర్ణయానికి మాత్రం రాలేకపొతున్నాయి. సీఎం పీఠం తమకే కావాలంటూ శివపేన, కాదు తమకే అంటూ బీజేపి పట్టు బడుతుండడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. మహారాష్ట్ర సీఎం పీఠాన్ని రెండు పార్టీలు సమానంగా పంచుకోండంలో ఏకాబిప్రాయం మాత్రం కుదరడంలేదు. దీంతో శనివారం లోపు ఇరు పార్టీలు తగు నిర్ణయానికి రాక పోతే పరిస్థితి మరోలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపి నుండి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా కాకుండా నితిన్ గడ్కరీ పేరు తెరమీదకు వస్తోంది.
మహా రాజకీయాల్లో కొత్త ట్విస్ట్: గడ్కరి ఇంటికి అహ్మద్ పటేల్.. శరద్ నివాసానికి సంజయ్ రౌత్..!
కుదరని ఏకాభిప్రాయం.. మహా పీఠంపై కొనసాగుతుతున్న ప్రతిష్టంభన..
మహారాష్ట్ర రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇక్కడ సీట్లు గెలిచిన వారి కంటే, తక్కువ సీట్లు గెలిచిన వారు నింపాదిగా ఏ టెన్షన్ లేకుండా ఉన్నట్టు తెలుస్తోంది. తాను ప్రతిపక్షంలో ఉంటానని ఎన్సీపి అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కూడా అభినందించింది. తనను ప్రతిపక్షంలో ఉండమని ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి దానికే కట్టుబడి ఉంటాను అని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలతో సానుకూల వాతావరణం చోటుచేసుకుంది. అయితే, ఇప్పటి వరకూ మహారాష్ట్ర పీఠంపై సీఎం ఎవరనేది ఉత్కంఠగానే మారింది.
అధికార వికేంద్రీకరణపై అనుమానాలు..! మహారాష్ట్ర రాజకీయాల్లో అందుకు అనిశ్చితి..!!
అత్యధిక సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ సీఎం అభ్యర్థిని నిర్థారిస్తుంది అనుకోవడానికి ఏ మాత్రం వీలు లేని పరిస్ధితులు మహారాష్ట్రలో నెలకొన్నాయి. మహా రాజకీయం చాలా భిన్నంగా ఉంటాయనడానికి ఇదో పెద్ద ఉదాహరణ. శివసేనను కాదని ముందడుగు వేద్దామనుకుంటే ఆరెస్సెస్ చూస్తూ కూర్చునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. బీజేపీకి కావలిసినంత మెజారిటీ రాని నేపథ్యంలో సీఎం సీటు శివసేనకు వదులుకోవడానికి బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి కొత్త మొహం తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ.
తెరపైకి అనూహ్యంగా కొత్తపేరు..! సీఎంగా నితిన్ గడ్కరీ..!!
శివసేనకు, ఆరెస్సెస్ కు ఆమోదయోగ్యమైన ఒక కొత్త వ్యక్తి మహారాష్ట్ర సీఎం అభ్యర్ధి రేసులో అనూహ్యంగా తెరమీదకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి అంతగా నచ్చని వ్యక్తి అయిన నితిన్ గడ్కరీ మహారాష్ట్ర పీఠాన్ని అధిరోహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల ముందు ఏర్పడిన పొత్తు కాబట్టి ఈ పాటికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగిపోవాల్సి ఉంది. కానీ శివసేనకు ఆదరణ పెరిగేటప్పటికి ఆ పార్టీ మెలికలు పెట్టింది. దీందో బీజేపి, శివసేన పార్టీల మద్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.
శనివారంలోపు పట్టువిడవాలి..! లేకపోతే ఇరు పార్టీలకు ఇబ్బందులే..!!
అనేక సమీక్షలు, చర్చలు, ట్విస్టుల నేపథ్యంలో బీజేపీ, శివసేన మధ్య నెలకొన్న విభేదాలు ఒక కొలిక్కి రాకపోవటంతో ఇరు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. దేశంలోనే అత్యంత హిందుత్వ పార్టీ అయిన శివసేన, కాంగ్రెస్- ఎన్సీపీలతో జత కట్టేందుకు సిద్ధంగా లేకపోవటం ఇరు పార్టీల మద్య వివాదం ముదరడానికి మరో కారణంగా తెలుస్తోంది. కచ్చితంగా ఏర్పాటయ్యేది బీజేపీ శివసేన ప్రభుత్వమే గాని అధికారం ఎవరి చేతిలో పెట్టాలి అన్నదే చిక్కు ప్రశ్నగా మారింది. శివసేన ఈసారి ఎపుడూ లేనంత మొండిగా వ్యవహరిస్తోంది. ఐతే సీఎం పీఠంపై మొదటి రెండున్నరేళ్లు కూర్చునేందుకు నితిన్ గడ్కరీ ఐతే తమకు ఆమోదయోగ్యమనే సంకేతాలను శివసేన పంపుతున్నట్టు ప్రచారం జరుగోతంది.