జమ్మూకశ్మీర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు: గ్రెనేడ్లతో దాడి..15మందికి తీవ్రగాయాలు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. సోపూర్ బస్టాండులో గ్రెనేడ్లతో దాడి చేయడంతో పదిహేనుమందికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం సీఆర్పీఎఫ్ జవాన్లు శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొందరు మిలిటెంట్లు దాడి చేసి వారిని గాయపరచిన ఘటన మరువకముందే మరో ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ తరహా దాడులు జరగడం అక్కడ ఐదోసారి.
#Terrorists lobbed a #grenade on #civilians at #BusStand #Sopore. 6 #civilians sustained #injuries. Information is preliminary in nature. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) October 28, 2019
అక్టోబర్ 12 వ తేదీన జరిగిన గ్రెనేడ్ దాడుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. ఈ ఘటన శ్రీనగర్లోని హరిసింగ్ హై స్ట్రీట్లో ఉన్న మార్కెట్ వద్ద జరిగింది. అక్టోబర్ 5వ తేదీన అనంతనాగ్ జిల్లాలో జరిగిన గ్రెనేడ్ దాడుల్లో 14 మంది తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళలు ఒక పోలీసు ఉన్నారు. ఇదిలా ఉంటే విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు టార్గెట్గానే ఈ దాడులు జరుగుతున్నాయని సీఆర్పీఎఫ్ అధికారులు గతనెలలో చెప్పారు.
ఇదిలా ఉంటే యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం జమ్మూ కశ్మీర్లో పర్యటించడానికి ఒక్కరోజు ముందర ఈ దాడులు చేయడం అక్కడి భద్రతను ప్రశ్నిస్తోంది. సోపూర్లో జరిగిన దాడితో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూకశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. కశ్మీర్లోయలో నెలకొన్న పరిస్థితుల తర్వాత అక్కడి ఆంక్షలు ఎత్తివేస్తున్న క్రమంలో ఈ దాడులు జరగడం ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తీసుకొస్తున్నాయి. అక్టోబర్ 31 జమ్ము కశ్మీర్ను అధికారికంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించనున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు విరుచుకుపడుతుండటం ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.