పేట్రేగిన ఉగ్రవాదులు: పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ల దాడి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అయిదో విడత పోలింగ్ సందర్భంగా బీభత్సం సృష్టించారు. పుల్వామా జిల్లాలోని రోహ్మూ పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్లతో దాడి చేశారు. ఓటర్లు బారులు తీరిన సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. గ్రనేడ్ల దాడిలో ప్రాణానష్టం ఏమైనా సంభవించిందా? లేదా? అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా అయిదో విడత పోలింగ్ సందర్భంగా జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్ లోక్సభ స్థానం కోసం సోమవారం ఉదయం పోలింగ్ ఆరంభమైంది. ఇందులో భాగంగా- రోహ్మూ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉగ్రవాదుల దాడి చేయొచ్చనే ఉద్దేశంతోనే ఈ పోలింగ్ కేంద్రాన్ని అత్యంత సున్నితమైనదిగా గుర్తించారు ఎన్నికల అధికారులు. దీనికి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ఆర్మీ, పోలీసుల బలగాలను మోహరింపజేశారు.
పోలింగ్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందే- భారీ ఎత్తున తనిఖీలను నిర్వహించారు. ప్రతి వాహనాన్నీ సోదా చేశారు. అయినప్పటికీ- గ్రనేడ్ దాడి చోటు చేసుకుంది. మిలిటెంట్లు ఈ పోలింగ్ కేంద్రంపై రెండు గ్రనేడ్లు విసరగా.. అందులో ఒకటి పేలలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అదనపు పోలీసు, ఆర్మీ బలగాలను రోహ్మూ పోలింగ్ కేంద్రానికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహూతి దాడికి పాల్పడినది పుల్వామా జిల్లాలోనే. జిల్లాలోని అవంతిపురా వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.