పేట్రేగిన ఉగ్రవాదులు: మార్కెట్ పై గ్రెనేడ్లతో దాడి..15 మందికి గాయాలు: ఒకరి మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. గ్రెనేడ్లతో దాడికి తెగబడ్డారు. సోమవారం మధ్యాహ్నం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న మార్కెట్ పై గ్రెనేడ్లు విసిరారు. ఈ ఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇద్దరు మరణించినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన చోటు చేసుకున్న వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడికి తెగబడటం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.
పీఓకే కాల్పుల్లో 18 మంది ఉగ్రవాదులు హతం..? లాంచ్ ప్యాడ్లు ధ్వంసం: అధికారులు
శ్రీనగర్ నడి బొడ్డున ఉన్న లాల్ చౌక్ కు కూతవేటు దూరంలో ఉంటుంది ఈ మార్కెట్. సోమవారం కావడంతో పెద్ద ఎత్తున కొనుగోలుదారులు, వ్యాపారులు, కూరగాయలను తరలించే వాహనాలతో క్రిక్కిరిసిపోయింది. అనూహ్యంగా ఉగ్రవాదులు గుర్తు తెలియని వాహనంలో వచ్చి గ్రెనేడ్లు విసిరి, పారిపోయారు. చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తూ పేలిపోయాయి అవి. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో కొనుగోలుదారులు, వ్యాపారులు భీతిల్లారు. పరుగులు తీశారు. దీనితో మార్కెట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే భద్రతా జవాన్లు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరు మరణించినట్లు స్పష్టమైంది. మరి కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం జవాన్లు అన్వేషణ మొదలు పెట్టారు. సమీప ప్రాంతాలు, భవనాల్లో నక్కి ఉండొచ్చనే అనుమానంతో మార్కెట్, లాల్ చౌక్ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడికి తెగబడటం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.