షాకింగ్ : పెళ్లయిన కొద్ది గంటలకే.. శవమై చెట్టుకు వేలాడిన వరుడు..
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగిందని వధూవరుల కుటుంబాలు సంతోషంగా గడుపుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పెళ్లి అయిన కొద్ది గంటలకే వరుడు శవమై ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. తమ కళ్ల ముందే సంతోషంగా పెళ్లి చేసుకున్న కొడుకు.. ఇలా ఎందుకు చేశాడో అర్థం కాక అతని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అటు వధువు కుటుంబం కూడా తీవ్ర షాక్కి గురైంది.
ప్రేమ వివాహం..
మీరట్కు చెందిన దుశ్యంత్ గిరి(22) అనే యువకుడు బరేలీకి చెందిన ఆశ అనే యువతిని ప్రేమించాడు. ఇరు కుటుంబాల పెద్దలను పెళ్లికి కూడా ఒప్పించాడు. ఇదే క్రమంలో మంగళవారం ఘనంగా వివాహం జరిగింది. వివాహ అనంతరం బరాత్ ఏర్పాటు చేయగా.. అందరూ డ్యాన్సుల్లో మునిగిపోయారు. బరాత్ ఊరేగింపు జరుగుతున్న సమయంలో.. కారు నుంచి కిందకు దిగిన వరుడు.. పక్కనే ఉన్న ఓ షాప్కి వెళ్లాడు. అక్కడ ఛాయ్ ఆర్డర్ ఇచ్చాడు.
కనిపించకుండా పోయిన దుశ్యంత్..
ఛాయ్ ఆర్డర్ ఇచ్చిన కొద్దిసేపటికే దుశ్యంత్ అదృశ్యమయ్యాడు. దీంతో చుట్టుపక్కల అతని కోసం గాలించినప్పటికీ లాభం లేకపోయింది. చేసేది లేక వధూవరుల కుటుంబాలకు ఇంటికి వెళ్లిపోయాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు రంగంలోకి దిగారు. కొద్ది గంటల తర్వాత.. ఓ ప్రాంతంలో దుశ్యంత్ చెట్టుకు ఉరేసుకున్నట్టు గుర్తించారు.
అనుమానం వ్యక్తం చేసిన వధువు..
దుశ్యంత్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు చేరవేశారు. దీంతో సంఘటనా స్థలాన్ని చేరుకున్న కుటుంబ సభ్యులు.. దుశ్యంత్ను అలా చూసి షాక్ తిన్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. దుశ్యంత్ సంతోషంగా పెళ్లి చేసుకున్నాడని.. ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని వాపోయారు. వధువు ఆశ దుశ్యంత్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేసింది. దీని వెనకాల ఇంకేదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.