విషాదం: పేలిన పెళ్లి కానుక: నవ వరుడు మృతి, వధువుకు తీవ్ర గాయాలు
Recommended Video
భువనేశ్వర్: కొత్తగా వివాహం చేసుకున్న ఆ జంటను పెళ్లి కానుకే వేరు చేసింది. పెళ్లికి వచ్చిన కానుకను తెరిచి చూస్తుండగా.. అందులో పెట్టిన బాంబు పేలింది. దీంతో తీవ్రగాయాలపాలైన వరుడు, అతని నాన్నమ్మ ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవ వధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని బొలంగీర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫిబ్రవరిలోనే వివాహం
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బొలంగీర్ జిల్లా పాట్నాగఢ్ పట్టణంలోని బ్రహ్మపుర వీధికి చెందిన సౌమ్యశేఖర్(35)కు బౌద్ధ్కు చెందిన రీమా సాహుతో ఫిబ్రవరి 18న వివాహం జరిగింది.
పార్సిల్ రూపంలో..
గత శుక్రవారం వధూవరులతోపాటు నాన్నమ్మ జెమామణి మాత్రమే ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వచ్చి రాయ్పూర్ నుంచి కొరియర్ వచ్చిందని ఓ పార్శిల్ను సౌమ్యశేఖర్కు ఇచ్చి వెళ్లారు.
పేలిన కానుక
ఎవరో తమకు తెలిసిన వారు పెళ్లి కానుక పంపించారని భావించిన సౌమ్యశేఖర్.. ఆ పార్సిల్ను పట్టుకుని వంటగదిలో ఉన్న రీమాసాహు వద్దకు వెళ్లి ఆ పార్సిల్ను విప్పాడు. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో సౌమ్యశేఖర్, రీమా, ఆ పక్కనే ఉన్న జెమామణిలు చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వరుడితోపాటు నాన్నమ్మ మృతి
వరుడి నాన్నమ్మ జెమామణి ఆస్పత్రిలోనే మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సౌమ్యశేఖర్ను మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. రీమా సాహును కటక్లోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పార్సిల్ రాయ్పూర్ నుంచి వచ్చినట్లు తెలిపారు. బాంబును పెట్టి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికుందనే కోణంలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.