సరిగ్గా పెళ్లి టైమ్కి ఊహించని ట్విస్ట్!.. వధువు చెల్లెలితో వరుడి పెళ్లి
విషం తాగి నురగలు కక్కుతున్న వధువును స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, తనకు పైచదువులు చదవాలనుందని, అందువల్ల ఇప్పుడే వివాహం చేసుకోనని సదరు వధువు వెల్లడించింది.
చెన్నై: సరిగ్గా పెళ్లి ముహూర్తానికి వధువు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడటంతో.. పీటల మీది పెళ్లి ఇక ఆగిపోయినట్లేనని అంతా భావించారు. అయితే వరుడి కుటుంబ సభ్యులు మాత్రం వధువు చెల్లెలిని ఇచ్చి కట్టబెట్టాలన్నారు. అందుకు ఆమె కూడా ఓకె చెప్పడంతో.. చివరికి ఆగిపోయిందనుకున్న పెళ్లి కాస్త.. వధువు చెల్లెలితో జరిగిపోయింది.
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురయూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తురైయూరు ఒట్టంపట్టిలో వ్యాపారం నిర్వహిస్తున్న బాలకుమార్ (27కు సేలం జిల్లా సెందూరపట్టికి చెందిన శరణ్య(20)కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు బుధవారం నాడు వీరి వివాహాం జరగాల్సి ఉండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్ని జరిగిపోయాయి.
మంగళవారం రాత్రి వధువు ఊరేగింపు.. విందులు, వినోదాలతో ఆ ఇల్లు కళకళలాడింది. బుధవారం ఉదయం పెళ్లి ముహూర్తానికి వరుడు పెళ్లి పీటల మీద కూర్చున్న సమయంలో.. అందరూ షాక్ కు గురయ్యే వార్త వినిపించింది. పెళ్లి ఇష్టం లేక వధువు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడటంతో కొద్దిసేపు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
విషం తాగి నురగలు కక్కుతున్న వధువును స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, తనకు పైచదువులు చదవాలనుందని, అందువల్ల ఇప్పుడే వివాహం చేసుకోనని సదరు వధువు వెల్లడించింది.
అదే సమయంలో వరుడి తరుపువారు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. వధువుకు చెల్లెలు ఉండటంతో ఆమె సమ్మతంతో వివాహాం జరిపించాలని కోరారు. ఇందుకు వధువు చెల్లెలు సంగీత (18), ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో.. పీటల మీద ఆగిపోతుందనుకున్న పెళ్లి కాస్త తిరిగి వైభవంగా జరిగింది.