షాక్: పెళ్లి మండపంలోకి అడుగుపెట్టిన నవ వరుడిని కాల్చిచంపేశారు
అజాంగఢ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరికొద్ది సేపట్లో వివాహం చేసుకోవాల్సిన ఓ నవ వరుడిని మండపం వద్దే దుండుగులు కాల్చి చంపేశారు. ఈ ఘటన దేవ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీర్పూర్ బజార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
పెళ్లి మండపంలోకి అడుగుపెట్టగానే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి ఊరేగింపు(బరాత్) సింగ్పూర్ ప్రాంతం నుంచి పెళ్లి మండపానికి చేరుకుంది. పెళ్లి కుమారుడు మండపానికి నడిచి వస్తుండగా.. బైక్పై వచ్చిన ఇద్దరు దుండుగులు నవ వరుడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు.
రక్తపు మడుగులో వరుడు..
రక్తపు మడుగులో ఉన్న వరుడ్ని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు బంధువులు. అయితే, అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధరించారు. దీంతో ఆగ్రహం చెందిన మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలో గందరగోళం సృష్టించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
బంధువులు అరెస్ట్, విచారణ..
వరుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురు వరుడు, వధువు కుటుంబసభ్యులను అదుపులోకి పోలీసులు విచారణ చేపట్టారు. హంతకులు వరుడి ఊరేగింపును కొద్ది దూరం నుంచి వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు.
వరుడిని ఫాలో అయిన నిందితులు..
వరుడి వెంట వచ్చిన నిందితులు.. మండపంలోకి వస్తుండగా కాల్పులు జరిపి హత్య చేశారని పోలీసులు తెలిపారు. కాగా, ఆ ప్రదేశంలో సీసీ కెమెరాలు లేవని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.