వధువుతో రిలేషన్: పీటలపై వరుడి దారుణహత్య: కత్తెరతో పొడిచేశారు!
లక్నో: పాత కక్షలు ఓ యువకుడిని వెంటాడాయి. పెళ్లి పీటల మీదే అతని ఉసురు తీశాయి. ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యా సమీపంలోని కుమార్గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హతుడి పేరు సురేంద్ర కోరి. స్థానిక ఇనాయత్ నగర్లో నివాసం ఉంటున్నాడు. నెలరోజుల కిందట అదే ప్రాంతానికి చెందిన పింకీ అనే యువతితో అతనికి పెళ్లి కుదిరింది. సోమవారం తెల్లవారు జామున ముహూర్తం.
ముందురోజు రాత్రి వరుడు, అతని తరఫు బంధుమిత్రులు కుమార్గంజ్లోని పెళ్లి మంటపానికి చేరుకున్నారు. మేళతాళాలతో అతణ్ని ఊరేగించారు. తెల్లవారితే పెళ్లి తంతు ముగియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో- పెళ్లి మంటపం అంతా బంధుమిత్రులతో కళకళలాడసాగింది. అదే సమయానికి ఇద్దరు యువకులు కళ్యాణ మంటపానికి చేరుకున్నారు. సురేంద్రను పలకరించారు.
అతణ్ని మాటల్లో పెట్టి, స్నానపు గది వరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. దీనితో- తమ వెంట తెచ్చుకున్న కత్తెరలతో సురేంద్రను పొడిచి పారిపోయారు. గావు కేక పెడుతూ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సురేంద్రను అతని బంధువులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. ఊహించిన ఈ ఘటనతో అతని తరఫు బంధువులందరూ విస్తుపోయారు. కుమార్గంజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
సురేంద్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రికి తరలించారు. శరీరంపై మూడు కత్తెర పోట్లు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో సురేంద్ర కుటుంబీకులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబీకులు ఫిర్యాదు ఆధారంగా పింటూ, బిట్టు అనే యువకులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, వారి కోసం అన్వేషిస్తున్నామని కుమార్గంజ్ ఎస్ఐ మనోజ్కుమార్ సింగ్ తెలిపారు. హంతకుల్లో ఒకరికి వధువు పింకీతో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నామని అన్నారు. దీనికితోడు సురేంద్ర కోలికి పాతకక్షలు ఉన్నాయని చెప్పారు.