గ్రౌండ్ రిపోర్ట్ : బెంగళూరు అల్లర్లు... ఎక్కడ ఎలా మొదలై ఎలా తారాస్థాయికి చేరింది...
బెంగళూరులోని డీజే హళ్లి,కేజీ హళ్లి,కవల్ బైరసంద్ర ప్రాంతాల్లో మంగళవారం(అగస్టు 11) రాత్రి చోటు చేసుకున్న హింసాత్మక అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. దాదాపు 110 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ నగరాన్ని కుదిపేసిన ఈ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ మీడియా ది క్వింట్ గ్రౌండ్ రిపోర్ట్ కథనాన్ని ప్రచురించింది.
పోలీస్ స్టేషన్కు పాషా..
క్వింట్ కథనం ప్రకారం... ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు మేనల్లుడు నవీన్ మహమ్మద్ ప్రవక్తపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సాయంత్రం 6గం. సమయంలో వైరల్ అయింది. దీనిపై మొదటి స్పందన సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(SDPI) నేత ముజామిల్ పాషా నుంచి వచ్చింది. ఈ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు అక్కడి పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 150 మందిని వెంటపెట్టుకుని పాషా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. ఇందులో చాలామంది పోలీస్ స్టేషన్ గేటు బయటే నిలబడగా.. కొంతమంది మాత్రమే పాషాతో లోపలికి వెళ్లారు.
పోలీసుల లాఠీచార్జి...
పాషా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. అయితే పాషాతో వచ్చిన మూక పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగడంతో... స్థానిక మసీదుకు చెందిన ఒక ఇమామ్ను పోలీసులు అక్కడికి పిలిపించారు. ఆ ఇమామ్ ఆ మూకకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితుడిపై కేసు నమోదైందని... త్వరలోనే అరెస్టవుతాడని వాళ్లతో చెప్పారు. అయితే ఇమామ్ మాటలకు వారు శాంతించలేదు. నవీన్ను అరెస్ట్ చేయకపోవడంపై వారు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొంతమంది పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా... పోలీసుల లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు.
పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టి...
ఆ తర్వాత కొద్దిసేపటికి,నవీన్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీస్ టీమ్స్ వ్యాన్ స్టేషన్కు తిరిగొచ్చింది. ఆ సమయంలో పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టిన మూక నవీన్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే నవీన్ అందులో లేడని తెలియడంతో తీవ్ర ఆగ్రహంతో విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ మూక పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లింది. అప్పటికే స్టేషన్ ముందు ప్రాంగణంలోకి దూసుకెళ్లడంతో... పోలీసులు తమను తాము లోపల నిర్బంధించుకున్నారు. ఆ తర్వాత,ఆ మూక రోడ్డుపై ఉన్న వాహనాలతో పాటు పోలీస్ స్టేషన్ పార్కింగ్లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టింది.
అర్ధరాత్రి కాల్పులు....
పోలీస్ స్టేషన్పై దాడి గురించి తెలియడంతో రాత్రి 10.30గం. సమయంలో కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ అక్కడికి చేరుకున్నారు. అయితే దాదాపు 800 మంది ఉన్న ఆ మూక స్టేషన్ బయటే ఉండటంతో... ఆ పోలీస్ టీమ్స్ లోపలకు వెళ్లలేకపోయాయి. తమ సంఖ్య తక్కువగా ఉండటంతో మూకను చెదరగొట్టేందుకు రాత్రి 11.30గంటల సమయంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అది కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో అర్ధరాత్రి గాల్లోకి కాల్పులు జరిపి మూకను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మూక పైనే కాల్పులు జరిపారు.
డీజే హళ్లి నుంచి కేజీ హళ్లి వైపు...
ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ... వీధుల్లో చేరిన మూకను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా... వాళ్లే బాటిల్స్,రాళ్లతో తమపై దాడికి పాల్పడ్డట్టు చెప్పారు. దీంతో పోలీస్ యాక్షన్ కొనసాగిందని... అదనపు బలగాలు వచ్చి చేరుతూనే ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఆ మూకలోని ఒక గుంపు డీజే హళ్లి పోలీస్ స్టేషన్ నుంచి కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ వైపు వెళ్లిందన్నారు. అక్కడ పోలీస్ స్టేషన్తో పాటు పోలీస్ క్వార్టర్స్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో స్టేషన్ బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు.
Recommended Video
నవీన్ ఇంటిపై దాడి...
డీజే హళ్లిపై ఆ మూక దాడి కొనసాగుతుండగానే... మరో మూక కవల్ బైరసంద్రలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి ఇంటివైపు వెళ్లారు. నవీన్ తండ్రి టి.పవన్ కుమార్ మాట్లాడుతూ... దాదాపు 500-800 మంది రాత్రి 8.30గం. సమయంలో తన ఇంటి మీదుగా వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అందులో కొంతమంది వెనక్కి వచ్చి నవీన్ ఇంటి ముందు గుమిగూడినట్లు చెప్పారు. నిజానికి వాళ్లు నిరసనకు దిగుతారనో లేక నినాదాలు చేస్తారనో తాము భావించామని... కానీ ఆ వెంటనే వారు రాళ్లు రువ్వడం మొదలుపెట్టారని అన్నారు. తమ ఇంటి వద్ద ఉన్న ముగ్గురు పోలీసులు తమను ఇంట్లోకి వెళ్లి లాక్ వేసుకోమని చెప్పారన్నారు.
అదే సమయంలో ఎమ్మెల్యే ఇంటిపై...
కొద్దిసేపటికే ఆ మూక నవీన్ ఇంట్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడింది. ఇంటిని లూటీ చేసింది. ఇంట్లో ఉన్న ఏడుగురు కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ బాల్కనీ వాల్ ద్వారా పొరుగు ఇళ్లల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. నవీన్ ఇంటిపై దాడి చేసి,అతని కారును తగలబెట్టాక... రాత్రి 10.30గం. సమయంలో అదే ప్రాంతంలోని మరికొన్ని ఇళ్లపై పడ్డారు. వాహనాలను తగలబెట్టారు. అదే సమయంలో కొంతమంది మూక ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఇంటి వైపు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంటితో పాటు పార్కింగ్లోని వాహనాలకు నిప్పంటించారు. అర్ధరాత్రి డీజే హళ్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు కాల్పులు జరిపిన గంట సేపటికి.. అంటే రాత్రి ఒంటిగంట సమయంలో ఎట్టకేలకు అక్కడ పరిస్థితులు తిరిగి అదుపులోకి వచ్చాయి.