రైల్వే పోలీసుల దాష్టీకం: విలేకరిని నిర్బంధించి, చితగ్గొట్టి, బట్టలు ఊడదీసి, నోట్లో మూత్రం పోసి
లక్నో: రైల్వే పోలీసులు మరోసారి తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఓ జర్నలిస్ట్పై తమ ప్రతాపాన్ని చూపారు. అందరి ముందూ అతణ్ని చితగ్గొట్టారు. నిర్బంధించారు. అక్కడితో వారి కసి తీరలేదేమో.. ఆ జర్నలిస్ట్పై మూత్రం పోశారు. ఈ దారుణ ఉదంతం ఉత్తర్ ప్రదేశ్లోని షామ్లీలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు ఆ జర్నలిస్ట్ను చితక్కొడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన సిబ్బందిని సస్పెండ్ చేశారు.
షామ్లీ సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం రాత్రి ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ సమాచారం అందిన వెంటనే ఓ న్యూస్ ఛానల్లో పనిచేస్తోన్న స్థానిక జర్నలిస్ట్ అమిత్ శర్మ తన కెమెరాతో సహా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గూడ్స్ పట్టాలు తప్పిన దృశ్యాలను చిత్రీకరిస్తుండగా.. జనరల్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ రాకేష్ కుమార్, కానిస్టేబుల్ సంజయ్ పవార్ ఆయనను అడ్డుకున్నారు. ఈ ఘటనను చిత్రీకరించడానికి వీల్లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
#WATCH Shamli: GRP personnel thrash a journalist who was covering the goods train derailment near Dhimanpura tonight. He says, "They were in plain clothes. One hit my camera&it fell down. When I picked it up they hit&abused me. I was locked up, stripped&they urinated in my mouth" pic.twitter.com/nS4hiyFF1G
— ANI UP (@ANINewsUP) June 11, 2019
ఈ సందర్భంగా వారు అమిత్ శర్మను దుర్భాషలాడారు. దీనితో ఇద్దరి మధ్య వాగ్వివాదం చెలరేగింది. దీనితో ఆగ్రహానికి గురైన రాకేష్ కుమార్, సంజయ్ పవార్.. తమ చేతులకు పని చెప్పారు. అమిత్ శర్మపై విరుచుకుపడ్డారు. విచక్షణా రహితంగా కొట్టారు. అతని వద్ద ఉన్న కెమెరాను లాక్కుని నేలకేసి విసిరి కొట్టారు. దీనితో అది ధ్వంసమైంది. వారు కొట్టిన దెబ్బలకు అమిత్ శర్మ నోటి నుంచి రక్తం కారింది. అయినప్పటికీ.. జీఆర్పీ పోలీసులు శాంతించలేదు. కాలర్ పట్టుకుని లాక్కెళ్లారు.
రైల్వే స్టేషన్ ఆవరణలో గదిలో నిర్బంధించారు. అక్కడా ఆయనను కొట్టారు. బట్టలు ఊడదీసి మరీ చిత్రహింసలకు గురి చేశారు. అక్కడితో వారి కసి తీరలేదు. ఆయన నోట్లో మూత్రం పోశారు. మూర్ఛపోయేలా ముష్టిఘాతాలు కురిపించారు. తనను దారుణంగా కొట్టి, కెమెరాను ధ్వంసం చేశారని ఆయన వాపోయారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ ఘటనకు కారణమైన రాకేష్ కుమార్, సంజయ్ పవార్లను సస్పెండ్ చేసినట్లు మొరాదాబాద్ రైల్వే ఎస్పీ సుభాష్ చంద్ర దూబే తెలిపారు.
ఈ ఘటనపై స్థానిక జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం వారు షామ్లీలో నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అమిత్ శర్మను తీవ్రంగా కొట్టిన జీఆర్పీ పోలీసులను సస్పెండ్ చేయడంతోనే సమస్య తీరిపోదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులకు వారు వినతిపత్రాలను అందజేశారు.