జీశాట్ - 11 సక్సెస్.. భారత్ విలువైన అంతరిక్ష ఆస్తి : ఇస్రో ఛైర్మన్
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ - ఇస్రో.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సమాచార ఉపగ్రహం జీశాట్ - 11 ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో దేశవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింత విస్తరించనున్నాయి. అంతేకాదు న్యూ జనరేషన్ అప్లికేషన్ల రూపకల్పనకు మార్గం సుగమం కానుంది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా స్పేస్ సెంటర్ నుంచి ఏరియన్ - 5 రాకెట్ ద్వారా జీశాట్ - 11 ను గగనతలంలోకి పంపించింది ఇస్రో.
ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో అన్నిటికంటే బరువైంది జీశాట్ - 11. అంతేకాదు బిగ్ బర్డ్ గా పిలిచే దీని తయారీకి 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇస్రో. డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా సెకనుకు 100 జీబీ డాటా అందించేలా ఇస్రో ప్రయోగిస్తున్న నాలుగు జీశాట్ -11 ప్రయోగాల్లో ఇది మూడోది.
33 నిమిషాల పాటు ప్రయాణించిన ఏరియన్ - 5 రాకెట్.. జీశాట్ - 11 ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 5,854 కిలోల పరిమాణంలో ఉన్న ఈ ఉపగ్రహం పదిహేనేళ్ల పాటు సేవలు అందించనుంది. సమాచార వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లనున్న జీశాట్ - 11 ఉపగ్రహం మనదేశానికి విలువైన అంతరిక్ష ఆస్తిగా అభివర్ణించారు ఇస్రో ఛైర్మన్ కె.శివన్.