అంతరిక్షంలో భారత్ మరో విజయం: నింగిలోకి విజయవంతంగా జీశాట్ 7ఏ ఉపగ్రహం
భారత అంతరిక్ష పరిశోదనా సంస్థ ఇస్రో వరుస ప్రయోగాలతో దూసుకెళుతోంది. నెల వ్యవధిలోనే మూడు ప్రతిష్టాత్మక ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రం నుంచి నింగిలోకి జీశాట్ 7ఏ ఉపగ్రహం దూసుకెళ్లింది. మిలటరీ అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. జీఎస్ఎల్వీ ఎఫ్ 11 రాకెట్ జీశాట్ -7ఏను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహంతో సమాచార వ్యవస్థ మరింత బలపడనుంది. జీఎస్ఎల్వీ ఎఫ్ 11 రాకెట్ ఇస్రో రూపొందించిన నాలుగో తరం రాకెట్. మూడు స్టేజెస్లో ఇది ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది.
ఈ ఉపగ్రహం నింగిలోకి పంపడం ద్వారా సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. 2250 కిలోల బరువున్న జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ సమాచార వ్యవస్థ కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి సులభతరం కానుంది. భారత వాయుసేనకు 70 శాతం సేవలు అందించనుండగా... భారత ఆర్మీకి 30శాతం సేవలు అందించనుంది. మొత్తం 8 ఏళ్ల పాటు జీశాట్ 7ఏ ఉపగ్రహం సమాచార వ్యవస్థకు సేవలందించనుంది.
ఇస్రో బుధవారం ప్రయోగించిన జీశాట్ 7ఏ ఉపగ్రహం సమాచార వ్యవస్థకు సంబంధించి 39వ ఉపగ్రహం. భారత భూభాగంపై కేయూ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో ఇది పనిచేస్తుంది. భూభాగంపై ఉన్న రాడార్లను,ఎయిర్ బేస్లను, ఇతర ఇంటెలిజెన్స్ సమాచారం, సుదూర ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లను పసిగట్టడంలో జీశాట్ సహాయపడుతుంది. అంతే కాదు నిఘా కోసం పనిచేసే డ్రోన్లను కూడా ఈ ఉపగ్రహం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే 2013లో ఇస్రో జీశాట్-7 రుక్మిణిని నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహం నేవీ అవసరాలకు, హిందూ మహాసముద్రం ప్రాంతంలోని 2వేల నాటికల్ మైళ్ల వరకు పర్యవేక్షణ కోసం పంపడం జరిగింది.