ఇస్రో మరో కీలక ప్రాజెక్టు: భూ ఉపరితలాన్ని మరింత స్పష్టంగా: వచ్చే నెలే..శ్రీహరికోట నుంచి..!
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైంది. అంతరిక్షంపై ఆధిపత్యాన్ని చలాయిస్తోన్న ఇస్రో.. ఈ సారి జియో ఇమేజింగ్పై గట్టి పట్టు సాధించడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా- అత్యాధునిక పరికరాలతో కూడిన జియో ఇమేజింగ్ శాటిలైట్ జీశాట్-1ను అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది. వచ్చేనెల 5వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం (షార్) నుంచి ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది.
Recommended Video
దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు వెల్లడించింది. జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ జీశాట్-1ను మోసుకెళ్తుంది. శ్రీహరికోట ప్రయోగ కేంద్రంలోని రెండో నంబర్ లాంచింగ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీని ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ఎప్పుడనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని, వాతావరణ పరిస్థితులను బట్టి కౌంట్డౌన్ సమయాన్ని నిర్ధారిస్తామని పేర్కొంది
జీశాట్-1 ఉపగ్రహం బరువు 2275 కేజీలు. ఎర్త్ అబ్జర్వేషన్ కోసం అత్యాధునికమైన పరికరాలను ఇందులో అమర్చారు. జియో సంక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వంటి పరికరాలను అమర్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. భూఉపరితలాన్ని మరింత స్పష్టంగా ఫొటోలు తీయడానికి ఇది ఉపకరిస్తుందని వెల్లడించారు. భారత ఉపఖండం మొత్తాన్నీ సునిశితంగా పరిశీలించడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ తరహా ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతుండటం ఇదే తొలిసారి అని చెప్పారు.