జీఎస్టీతొ వృద్ది అనేది చెత్త మాట.. అసలు వ్యవహారం ఇదీ!: దేవ్రాయ్ సంచలనం
కానీ 1.5శాతం జీడీపీ పెరుగుదల అన్నది 13వ ఆర్థిక సంఘం నివేదికలో పేర్కొన్న జీఎస్టీ ఆధారంగా ఇచ్చినది, ప్రస్తుతం మనం దానికి దగ్గరలో కూడా లేము అని వివేక్ దేవ్ రాయ్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: జీఎస్టీ గురించి పూర్తి స్థాయిలో అతికొద్ది మందికి మాత్రమే అవగాహన ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్రం దీనిపై సరైన రీతిలో అవగాహన కల్పించుకుండానే జనంపై జీఎస్టీ భారం మోపేందుకు సిద్దమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారులు, మంత్రులు సైతం జీఎస్టీ గురించి ప్రస్తావిస్తే.. నీళ్లు నములుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమకు అర్థమైన రీతిలో జీఎస్టీ ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. అన్నింటికి మించి జీఎస్టీ సామాన్య జనానికి లాభమా? నష్టమా? అన్నదే అందులో కీలకంగా వినిపిస్తున్న ప్రశ్న. నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ ఆర్థిక నిపుణుడు వివేక్ దేవ్ రాయ్ మాత్రం దీనివల్ల దేశ జీడీపీలో ఎటువంటి మార్పు రాదని బల్ల గుద్ది మరీ చెబుతుండటం గమనార్హం.
అదంతా పనికిమాలిన ప్రచారం:
జీఎస్టీ తర్వాత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 1నుంచి 1.5శాతానికి పెరుగుతుందన్న ప్రచారాన్ని వివేక్ దేవ్ రాయ్ కొట్టిపారేశారు. అదంతా ఓ చెత్త ప్రచారం అని తేల్చేశారు. అయితే జీఎస్టీతో జీడీపీ పుంజుకుంటుందన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనతో తాను విభేదించనని దేవ్ రాయ్ పేర్కొనడం గమనార్హం.
అసంపూర్ణ జీఎస్టీ విధానంతో జీడీపీ ఎంతమేర పెరుగుతుందన్న దానిపై సరైన అవగాహన లేదన్నారు. ఇది ఎక్కువే ఉండవచ్చు లేదా తక్కువైనా ఉండవచ్చునని పేర్కొన్నారు. కానీ 1.5శాతం జీడీపీ పెరుగుదల అన్నది 13వ ఆర్థిక సంఘం నివేదికలో పేర్కొన్న జీఎస్టీ ఆధారంగా ఇచ్చినది, ప్రస్తుతం మనం దానికి దగ్గరలో కూడా లేము అని వివేక్ దేవ్ రాయ్ స్పష్టం చేశారు.
ఇండియాకు సరిపోదు:
ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన పన్నుల స్లాబులు 5,12,18,28శాతంగా ఉన్నాయి. హాంకాంగ్ లాంటి దేశాల్లో అన్ని రకాలైన వస్తువుల మీద ఒకే తరహా పన్ను అమలవుతోంది. కానీ మన దేశంలో ఒకటికి మించిన పన్నురేట్లు ఉండటం.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరమేనని దేవ్ రాయ్ అభిప్రాయపడ్డారు.
బహుళ పన్ను విధానాలు ఆర్థిక అడ్డంకులకు దారితీస్తాయని, తాను మాత్రం ఏకపన్ను విధానాన్నే సిఫారసు చేస్తానని చెప్పారు. ప్రపంచంలోని 140-160దేశాల్లో జీఎస్టీ అమలవుతుందన్న ప్రచారాన్ని కూడా దేవ్ రాయ్ ఖండించారు. ఆరేడు దేశాలకు మించి జీఎస్టీ ఎక్కడా అమలులో లేదన్నారు.
ఐటీ ఆధారితం.. చిన్న కంపెనీలపై ప్రభావం:
ప్రస్తుత జీఎస్టీ విధానం ఐటీతో ముడిపడి ఉన్న విషయం. ఇప్పటికీ దీనికి సంబంధించిన నెట్ వర్క్ పూర్తి స్థాయిలో సిద్దం కాలేదన్న విమర్శలున్నాయి. ఇలాంటి స్థితిలో చిన్న స్టీల్ కంపెనీలు త్వరితగతిన జీఎస్టీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కష్టమని భారత స్టెయిన్లెస్ స్టీల్ అభివృద్ధి సంఘ(ఐఎస్ఎస్డీఏ) ఆందోళన వ్యక్తం చేసింది.
అదే పెద్ద కంపెనీల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జీఎస్టీ విధానానికి సంసిద్దమయ్యేలా వారు కొత్త ఉద్యోగులను, వనరులను, సలహాదారులను, చార్టర్డ్ అకౌంటెంట్లను త్వరితగితన నియమించుకోగలరు. వ్యవస్థీకృత రంగంలో ఇది సాధ్యం. కానీ అవ్యవస్థీకృత రంగంలోని చిన్న కంపెనీలు ఈ ఐటీ ఆధారిత సేవలను అందిపుచ్చుకోవడం అంత సులువేమి కాదు. దీనిపై అవగాహనకు, జీఎస్టీ ఆపరేషన్ విధానాన్ని తెలుసుకోవడం వారికి సవాల్ లాంటిదే.