కేంద్రానికి షాక్: భారీగా తగ్గిన జీఎస్టీ ఆదాయం! ఎంతంటే.?
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) వసూళ్లు కేంద్రానికి నిరాశే మిగిల్చాయి. ఆశించిన ఆదాయం రాకపోగా.. వేల కోట్ల ఆదాయంకు గండిపడింది. ఈ ఏడాది ఆగస్టులో 98,202 కోట్ల ఆదాయం జీఎస్టీ రూపంలో వచ్చింది.
అయితే, సెప్టెంబర్ నెలలో ఈ మొత్తం దారుణంగా పడిపోయింది. రూ. 91,916కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దాదాపు రూ. 6వేల కోట్ల ఆదాయానికి గండిపడిందన్నమాట. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన వసూళ్లతో పోల్చుకుంటే 2.67శాతం తక్కువని కేంద్ర ఆర్థిక వర్గాలు ప్రకటించాయి. వరుసగా మూడో నెల కూడా జీఎస్టీ ఆదాయం తగ్గడం గమనార్హం. అంటే కొనుగోళ్లు పడుతున్నాయా? అనే సందేహం కలుగుతోంది.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో వసూలైన మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 91,916కోట్లు కాగా, ఇందులో విభాగాల వారీగా సీజీఎస్టీ రూ. 16,630 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 22,598కోట్లు, ఐజీఎస్టీ రూ. 45,069 కోట్లు (ఎగుమతులపై విధించిన పన్నులు రూ. 22,097కోట్లతో కలిపి), సెస్ రూ. 7,620కోట్లు (దిగుమతులపై విధించిన వసూళ్లు రూ. 728కోట్లతో కలిపి)గా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆదాయంపై కన్నేసిన కేంద్రం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ పన్ను తగ్గించడంతోపాటు ఇతర రాయితీలను ప్రకటించడంతో ఒక్కసారిగా దేశీయ మార్కెట్లు లాభాల బాటలోకి వచ్చాయి. దీంతో ఐపీఓపై ఆశలు వదులుకున్న కంపెనీలు కూడా మళ్లీ తిరిగి మార్కెట్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఐఆర్ సీటీసీ కూడా ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ. 1.05కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి భారంగా మారిన ఎయిరిండియా విక్రయం పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీపై ఇప్పటికే 30వేల కోట్ల అప్పు ఉంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లు సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ కొనుగోలుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిరిండియాను విక్రయించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం.