కరోనా దేవుడి చర్య, 2.35 లక్షల కోట్ల లోటు, రాష్ట్రాలకు 2 మార్గాలు, పన్నులు పెంచలేం: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రప్రభావం చూపిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఈ నేపథ్యంలోనే గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ వసూళ్ల వివరాలను వెల్లడించారు. కరోనా అనేది దేవుడి చర్య అని.. దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు గురైందన్నారు.
2.35 లక్షల కోట్ల జీఎస్టీ లోటు..
కరోనాతో నెలకొన్న పరిస్థితులతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు జీఎస్టీ పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా.. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.35 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లలో లోటు ఏర్పడిందని తెలిపారు.
రాష్ట్రాల కోసం రెండు ప్రతిపాదనలను..
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3 లక్షల కోట్లు జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉండగా.. రూ. 65వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో జీఎస్టీ పరిహారం చెల్లింపు అంశంపై రెండు ప్రతిపాదనలను రాష్ట్రాల ముందు ఉంచారు ఆర్థిక మంత్రి. ఒకటి.. ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం కాగా, రెండోది.. రూ. 2.5 లక్షల కోట్లను ప్రత్యేక ఏర్పాటు ద్వారా రూపొందించడం. ఈ ప్రతిపాదనలపై రాష్ట్రాలు ఏడు రోజుల్లో అభిప్రాయం తెలుపాలని కేంద్రమంత్రి సూచించారు. ఈ మొత్తం లోటులో జీఎస్టీ వల్ల రూ. 97వేల కోట్లు కాగా, మిగితాది కరోనా ప్రభావం వల్లేని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వివరించారు.
Recommended Video
పన్ను రేట్లు పెంచేందుకు సమయం కాదు..
పన్ను రేట్లు పెంచే అంశంపై చర్చించేందుకు ఇది తగిన సమయం కాదని జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయపడిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. మార్చిలో ఇచ్చిన రూ. 13,806 కోట్లతో కలిపి 2020లో రాష్ట్రాలకు రూ. 1.65లక్షల కోట్లు జీఎస్టీ పరిహారంగా విడుదల చేసినట్లు తెలిపారు. సుమారు ఐదు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలుపంచుకున్నారు.