జీఎస్టీ: హమ్మయ్య.. బంగారం బతికిపోయింది, 3 శాతమే పన్ను! ఇంకా వేటిపై ఎంతెంత అంటే..
బంగారంపై 3 శాతం పన్ను విధించాలని శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. బంగారంతోపాటు ఆభరణాలు , వజ్రాలు, వెండిపై 3 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది.
న్యూఢిల్లీ: హమ్మయ్య.. బంగారం బతికిపోయింది. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ బంగారంతోపాటు ఆభరణాలు , వజ్రాలు, వెండిపై 3శాతం పన్ను విధించాలని నిర్ణయించింది.
జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కొన్ని వస్తువులపై రేట్లను ఖరారు చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది.
రెడీమేడ్ దుస్తులపై 12 శాతం, నూలు, చేనేత వస్త్రాలపై 18శాతం, రూ.500లోపు ఉన్న పాదరక్షలపై 5 శాతం, రూ.500 దాటిన పాదరక్షలపై 18 శాతం చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు.
సిల్కు, జనపనార ఉత్పత్తులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. రూ.వెయ్యి లోపు వస్త్రాలపై 5 శాతం, బీడీలపై 28 శాతం, బ్రాండెడ్ బిస్కెట్లపై 18 శాతం, సౌర పలకలపై 5 శాతం చొప్పున పన్ను విధించారు.
గత నెలలో జరిగిన సమావేశంలో 1200కు పైగా వస్తువులు, 500 వరకూ సేవలకు నాలుగు శ్లాబుల్లో 5, 12, 18, 28 శాతం చొప్పున రేట్లు నిర్ణయించిన కౌన్సిల్ ఈ రోజు జరిగిన సమావేశంలో పసిడి, బిస్కెట్లు, దుస్తులు, పాదరక్షలు తదితర అంశాలకు సంబంధించి రేట్లను ఖరారు చేసింది. ఈ సమావేశంలో ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్లు పాల్గొన్నారు.
కొన్ని శ్లాబులపై అభ్యంతరాలున్నాయి: ఈటల
జీఎస్టీ శ్లాబులపై తమకు ఇంకా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలుచేయాలని అంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయని, సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడంపై దృష్టిపెట్టాలని, లేకపోతే గందరగోళం నెలకొంటుందన్నారు.
కొన్ని శ్లాబ్లపై ఉన్న అభ్యంతరాలను ఈ నెల 11న మళ్లీ ఢిల్లీలో జరిగే సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. సినిమా రంగంపై ప్రస్తుతం పన్ను ఎక్కువగా ఉందని, దాన్ని 12 శాతంగా నిర్ణయించాలని తాము ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు.