రెస్టారెంట్లపై ఇక జీఎస్టీ 5శాతమే: కస్టమర్లకు భారీ ఊరట
హోటల్స్, రెస్టారెంట్లపై జీఎస్టీ కౌన్సిల్లో విస్తృత చర్చ జరిగిందని ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు.
గౌహతి: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లపై వినియోగదారులకు భారీ ఊరట నిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని హోటల్స్పై (స్టార్ హోటల్స్తప్ప) జీఎస్టీ రేటును 5శాతంగా నిర్ణయించింది. శుక్రవారం గౌహతిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీ స్లాబ్ రేట్ల వివరాలను మీడియాకు వివరించారు.
Recommended Video
జీఎస్టీ భారాన్ని భారీగా తగ్గించాం
228 వస్తువుల్లో దాదాపు 178 వస్తువులకు 28శాతం జీఎస్టీ నుంచి మినహాయింపు(18శాతానికి) నిచ్చామనీ, 6 అంశాలను 5శాతంనుంచి జీరో శాతానికి తెచ్చామని చెప్పారు. అలాగే జీఎస్టీ భారాన్ని హోటల్స్పై భారీగా తగ్గించినట్టు అరుణ్ జైట్లీ తెలిపారు.
5శాతానికి తగ్గింపు
హోటల్స్, రెస్టారెంట్లపై జీఎస్టీ కౌన్సిల్లో విస్తృత చర్చ జరిగిందని ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. ఇప్పటివరకు 18శాతం ఉండగా, ఇపుడు 5శాతంగా నిర్ణయించామన్నారు. టర్నోవర్, ఏసీ, నాన్ఏసీతో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై జీఎస్టీ రేటు 5శాతంగా ఉంటుందని తెలిపారు.
ఏసీ, నాన్ ఏసీ తేడాలేదు..
ఈ క్రమంలో ఏసీ, నాన్ ఏసీ తేడా లేకుండా, అలాగే టర్నోవర్తో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై 5శాతం టాక్స్(విత్ అవుట్ ఐటీసీ)ను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ. 7,500 రూము రెంట్ వసూలు చేసే స్టార్హోటల్స్పై 18శాతం జీఎస్టీ (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్తో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. ఔట్ డోర్ కేటరింగ్పై 18శాతం (విత్ ఐటీసీ)గా ఉంటుంది.
15నుంచి కొత్తరేట్లు..
కాగా, ఐటీసీ(ఇన్పుట్ టాక్స్ క్రెడిట్)లో కొన్నిసవరణలు చేసినట్టు జైట్లీ వివరించారు. ఇన్పుట్ క్రెడిట్ను హోటల్ యాజమాన్యం వినియోగదారులకు పాస్ చేయడం లేదనీ తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకే రెస్టారెంట్ల ఇండస్ట్రీకి ఐటీసీ లభించదని స్పష్టం చేశారు. ఈ కొత్త రేట్లు నవంబరు 15నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. అలాగే పన్నులేమీ లేకుండా ఉన్నవారు ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేస్తే ప్రస్తుతం రూ.200(రోజుకు) జరిమానా విధిస్తుండగా, దాన్ని రూ.20(రోజుకు)కు తగ్గించారు. ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేసిన వారికి గతంలో రూ.200(రోజుకు) జరిమానా విధిస్తుండగా.. దాన్ని రూ.50(రోజుకు) చేశారు. జీఎస్టీపై సామాన్యుల నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.