చిన్న, మధ్యతరగతి వ్యాపారస్థులకు జీఎస్టీ భారీ ఊరట: రూ.40 లక్షల వరకు పన్ను లేదు
న్యూఢిల్లీ: గూడ్స్అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)లో చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు జీఎస్టీ కౌన్సిల్ భారీ ఊరటను కల్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఈ రోజు (జనవరి 10) జీఎస్టీ కౌన్సెల్ 32వ సమావేశం జరిగింది. ఈ భేటీలో చిన్న వ్యాపారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నారు. జీఎస్టీ మినహాయింపును ఏడాదికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచారు.
ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు దానిని రెండింతలు చేశారు. ఇది చిన్నవ్యాపారులకు ఊరట కాగా, ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కంపోజిషన్ స్కీం కింద పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచినట్లు జైట్లీ తెలిపారు.
గతంలో ఏడాది టర్నోవర్ కోటి రూపాయలు ఉన్నవాళ్లు మాత్రమే ఈ కంపోజిషన్ స్కీంలో చేరే అవకాశముండేది. ఇప్పుడు దీనిని పెంచారు. కంపోజిషన్ స్కీం కింద టర్నోవర్ను లెక్కించే సమయంలో ఒకే పాన్ రిజిస్టర్ అయిన అన్ని వ్యాపారాలను లెక్కలోకి తీసుకుంటారు. కంపోజిషన్ స్కీం కింద ఉన్న వాళ్లు మూడు నెలలకు ఓసారి పన్ను చెల్లించినా, రిటర్న్స్ మాత్రం ఏడాదికి ఓసారి ఫైల్ చేసుకోవచ్చునని చెప్పారు. సేవల రంగానికి కూడా కంపోజిషన్ స్కీంను విస్తరిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.
స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాల్లో పన్ను చెల్లింపుదారులు తమపై ఎక్కువ భారం పడుతోందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. జీఎస్టీపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా జీఎస్టీ మీటింగ్లో వారి టర్నోవర్ను రూ.20 లక్షల నుంచి రెండింతలు పెంచారు.