ఎన్నికల వేళ సామాన్యుడికి ఊరట: ఈ ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
ఇక పై టీవీలు, కంప్యూటర్లు, సినిమా టికెట్లు, వీడియోగేమ్లు ధరలు దిగిరానున్నాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ సమావేశంలో మరికొన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు టీవీ, కంప్యూటర్లు, వీడియో గేమ్స్ లాంటి వస్తువులు 28శాతం జీఎస్టీ శ్లాబులో ఉండేవి. ఇక ఎయిర్ కండీషనర్లు, సిమెంటు, పాన్మసాలా, పొగాకు ఉత్పత్తులు 28శాతం శ్లాబు కిందకు వచ్చాయి.
జీఎస్టీ సమావేశం తరువాత మీడియాతో ముచ్చటించిన అరుణ్ జైట్లీ... కంప్యూటర్లు, టీవీలు, టైర్లు, పవర్ బ్యాంకులను 28శాతం జీఎస్టీ శ్లాబు నుంచి 18శాతం జీఎస్టీ శ్లాబులోకి చేరుస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు దివ్యాంగులకు వినియోగించే పరికరాలపై 5శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెవిన్యూ దృష్టిలో ఉంచుకుని సిమెంట్, వాహనాల విడిభాగాలపై జీఎస్టీలో కోత విధించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు జైట్లీ స్పష్టం చేశారు. మరోవైపు సినిమా టికెట్ల పై కూడా శ్లాబును ప్రకటించారు. ఇప్పటి వరకు రూ.100 ఉన్న సినిమా టికెట్ 18శాతం జీఎస్టీ శ్లాబులోకి వచ్చేదని దాన్ని 12 శాతంకు తగ్గిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో రూ. 100కంటే ఎక్కువగా ఉన్న సినిమా టికెట్ ఇప్పటి వరకు 28శాతం జీఎస్టీ శ్లాబులో ఉండగా దాన్ని 18 శాతం శ్లాబులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
సమావేశానికి తమిళనాడు నుంచి ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్, ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి మనీష్ సిసోడియా, పశ్చిమ బెంగాల్ ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్ర, కర్నాటక గ్రామీణ శాఖ మంత్రి కృష్ణబైర గౌడ, కేరళ ఆర్థిక శాఖ మంత్రి టీఎం థామస్, హర్యానా ఆర్థికశాఖ మంత్రి కెప్టెన్ అభిమన్యు, పంజాబ్ ఆర్థికశాఖ మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్లు హాజరయ్యారు.