జీఎస్టీ వచ్చాక సామాన్యుడికి సరాసరి రూ.320 మిగులబాటు, ఎలా అంటే?
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమలయినప్పటి నుంచి భారతదేశంలోని సగటు కుటుంబ సభ్యులకు కొంత ఆదా అవుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.
జీఎస్టీ విషయంలో విపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గగా, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కాస్త పెరిగాయి. ఇలా చాలా వాటిలో మార్పులు కనిపించాయి.
సామాన్యుడికి రూ.320 ఆదా
జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఓ మధ్య తరగతి కుటుంబం కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల ద్వారా సగటున రూ.320 ఆదా అవుతోందని తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. వినియోగదారుల వ్యయ సూచీ విశ్లేషణ ద్వారా ఈ విషయం వెల్లడైనట్లుగా తెలిపారు. జులై 1, 2017న ప్రభుత్వ జీఎస్టీని అమలులోకి తీసుకు వచ్చారు. దీంతో ఎక్సైజ్ డ్యూటీ, సేల్ ట్యాక్స్, వ్యాట్తో సహా 17 రకాల కేంద్ర, రాష్ట్రాల పన్నులు ఒకే పన్నుగా మారాయి. మోడీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాల్లో ఇది ఒకటి.
తగ్గిన నిత్యావసర వస్తువుల ధరలు
జీఎస్టీ ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు సైతం తగ్గించేందుకు బాటలు పరిచిందని వెల్లడించారు. జీఎస్టీ అమలుకు ముందు తర్వాత పరిస్థితులను పరిశీలిస్తే దాదాపు 83 వస్తువుల ధరలు తగ్గాయి. వీటిలో ఆహార ఉత్పత్తులతో పాటు, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, సబ్బులు, వాషింగ్ పౌడర్, చెప్పులు వంటివి చాలా ఉన్నాయి. నిత్యవాసర వస్తువుల ధరలు తగ్గాయి.
రూ.320 ఎలా మిగులుతోందంటే?
ఒక సగటు మధ్య తరగతి కుటుంబం నెలకు రూ.8,400 ఖర్చు పెడుతుంటే, జీఎస్టీ అనంతరం తృణ ధాన్యాలు, ఆయిల్, పంచదార, చాక్లెట్లు, మిక్చర్, స్వీట్లు, సౌందర్య సాధనలు, వాషింగ్ పౌడర్, టైల్స్, ఫర్నీచర్ ఇలా గృహ వినియోగ ఉత్పత్తులపై దాదాపు రూ.320 తగ్గినట్లుగా వెల్లడైందని పేర్కొన్నారు. జీఎస్టీ అమలు కాకముందు రూ.8,400 ఖర్చు చేస్తే పన్నుల రూపంలో రూ.830 చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు కేవలం రూ.510 మాత్రమే పన్ను రూపంలో వెళ్తోందని, దీంతో వినియోగదారుడికి రూ.320 మిగులుతోందని పేర్కొన్నారు.
మోడీ కీలక నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో సర్జికల్ స్ట్రయిక్స్, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విదేశాలతో సత్సంబంధాలు పెరుగుతుండటంతో పాటు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు గట్టిగా బదులు ఇస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అలాగే, యూపీఏ హయాంలో పెట్రో ఉత్పత్తులపై చేసిన రూ.42వేల కోట్ల అప్పును మోడీ ప్రభుత్వం చెల్లించింది. తద్వారా భారత్ పైన భారం లేకుండా చేసిందని చెబుతున్నారు.