జిఎస్టీ ఎఫెక్ట్ : ఎటిఎంలు, బ్యాంకు లావాదేవీలు మరింత భారం
జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకుల సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎటిఎంల నుండి డబ్బులు డ్రా చేసుకోవడం వంటి వాటిపై బ్యాంకులు చార్జీలను వేయనున్నాయి.
న్యూఢిల్లీ: జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకుల సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎటిఎంల నుండి డబ్బులు డ్రా చేసుకోవడం వంటి వాటిపై బ్యాంకులు చార్జీలను వేయనున్నాయి. గతంలో కంటే ఎక్కువ చార్జీలను ఖాతాదారుడి నుండి వసూలు చేయనున్నారు.
జిఎస్టీ ఎఫెక్ట్ పలు వస్తువులపై ప్రభావం చూపుతోందని భావించారు. కానీ, దాని ప్రభావం బ్యాంకు సేవలపై కూడ తీవ్రంగానే కన్పించనుంది. వ్యాపారస్తులు, పరిశ్రమలపైనే ఎక్కువగా ఉంటుందని భావించినప్పటికీ బ్యాంకు లావాదేవీలపై కూడ ఈ ప్రభావం ఉంటుంది.
ఇప్పటికే పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల పేరు చెబితేనే భయపడే పరిస్థితి నెలకొంది. దాచుకొన్న డబ్బును కూడ సకాలంలో అందించే పరిస్థితి కూడ లేకపోయింది. అంతేకాదు ఇప్పుడిప్పుడే కుదురుకొంటుందని భావించిన తరుణంలో ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం బ్యాంకు ఖాతాదారులపై తీవ్రంగా కన్పిస్తోంది.
ఇప్పటికే ఎటిఎంల నుండి డబ్బులు డ్రా చేస్తే ఫైన్ పేరుతో చార్జీలను వసూలు చేస్తున్నారు. జిఎష్టీ పుణ్యాన ఈ జరిమానా మరింత ఎక్కువ కానుంది. దీంతో బ్యాంకుల మాట ఎత్తాలంటేనే ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.
మరింత ప్రియం కానున్న బ్యాంకు సేవలు
జిఎస్టీ పుణ్యాన బ్యాంకు సేవలు మరింత భారంగా మారనున్నాయి. బ్యాంకులు ఇక సంపన్నులకే అందుబాటులో ఉంటాయా అనే పరిస్థితి నెలకొన్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే లావాదేవీలపై బ్యాంకులు అనేక నిబంధలను విధించాయి. నెలలో ఎక్కువసార్లు డబ్బులు డ్రాచేసిన డిపాజిట్లు చేసిన సర్వీస్ ట్యాక్స్ రూపంలో బ్యాంకులు ఖాతాదారుల నుండి డబ్బులను వసూలు చేస్తున్నాయి.ఈ తరుణంలో జిఎస్టీ ఎఫెక్ట్ బ్యాంకుల సేవలను మరింత భారంగా మార్చనుంది.
ఎటిఎం కేంద్రాలపై 28 శాతం పన్ను
జిఎస్టీ పన్ను పరిధిలో ఎటిఎం కేంద్రాలపై పన్ను గరిష్టంగా 28 శాతం నిర్ణయించారు.దీంతో ఈ సేవలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో చిన్న బ్యాంకులు , కొత్తగా ఏర్పాటయ్యే పేమెంట్ బ్యాంకింగ్ సంస్థలపై మరింత భారం పడనుంది. దీంతో బ్యాంకులు కూడ ఎటిఎం ద్వారా డబ్బులను డ్రాచేసే కార్యక్రమాలపై ఎక్కువ ఛార్జీలను వసూలు చేసే అవకాశాలున్నాయి.
ఈఎంఐల భారం పెరగనుంది
ఎటిఎం నుండి ఉపసంహరణలు, నగదు డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్, చెక్ బుక్ జారీ సహా ఇతర బ్యాంకింగ్ సేవల కొత్త పన్ను పాలన కిందకు రానున్నాయి. దీని ప్రకారంగా బ్యాంకింగ్ లావాదేవీలపై 15 శాతం నుండి 18 శాతం సర్వీస్ ట్యాక్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నుల స్లాబ్ లలో మార్పుల ప్రకారం నిర్ణీత లావాదేవీలు ముగిసిన తర్వాత రూ.100 ప్రతి బ్యాంకింగ్ లావాదేవీకి, ప్రతి కస్టమర్ నుండి రూ. 3 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం 15 శాతం వసూలు
ప్రస్తుతం బ్యాంకులు సర్వీస్ ట్యాక్స్ కింద 15 శాతం ఛార్జీని వసూలు చేస్తున్నాయి. అయితే జిఎస్టీ కారణంగా చూపుతూ బ్యాంకులు సర్వీస్ ట్యాక్స్ ను 18 శాతానికి పెంచారు. జిఎస్టీ అమలుకు ముందే కౌన్సిల్ తో బ్యాంకు అధికారులు సమావేశమయ్యారు. ఎస్ బి ఐ ఛైర్మెన్ అరుంధతి భట్టాచార్య సర్వీస్ ట్యాక్స్ తో కలిపి జిఎస్టీ వసూలు చేయాలని చెప్పారు. దీంతో సర్వీస్ ట్యాక్స్ 15 నుండి 18 శాతానికి చేరుకొంది. ఈ మేరకు బ్యాంకులు చార్జీల విధింపుపై కస్టమర్లకు సమాచారాన్ని అందిస్తున్నాయి.