ఇళ్లు కొనేవారికి జీఎస్టీ భారీ ఊరట: నిర్మాణంలో ఉన్న గృహాలపై తగ్గింపు
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సెల్ 33వ సమావేశంలో కొత్త ఇళ్లు కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు.
అందరికీ ఇళ్లు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజల సొంతింటి కలను నిజం చేయనున్నామని ఈ సందర్భంగా జైట్లీ చెప్పారు. అందుకు, జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు.
తాజా నిర్ణయం ప్రకారం రూ.45 లక్షల లోపు గృహాల కొనుగోలుపై జీఎస్టీ 1 శాతం వర్తిస్తుందని, తగ్గించిన జీఎస్టీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు దృష్టిలో ఉంచుకుని జీఎస్టీని తగ్గించినట్లు చెప్పారు.
అలాగే, నిర్మాణంలో ఉన్న నివాస గౄహాలపై ఇప్పటివరకు 12 శాతం ఉండేది. జీఎస్టీ కౌన్సిల్ దీనిని తాజాగా 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. రూ.45లక్షల లోపు గృహాల కొనుగోలుపై జీఎస్టీ 1శాతంగా వర్తింపజేశారు. ఇంతకు ముందు ఇది 8%గా ఉండేది.
అలాగే, మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు లేదా అంతకంటే తక్కువ ప్రాంతంలో నిర్మించిన గృహాలను ఇక సరసమైన గృహాలుగా అభివర్ణిస్తారు. మెట్రో నగరాలు కాని నగరాల్లో 90 చదరపు మీటర్లు లేదా అంతకంటే తక్కువ స్థలంలో గృహాలు నిర్మిస్తే అవి సరసమైన గృహాల కిందకు వస్తాయి.