జీఎస్టీ ఊరట: సినిమాలు, టీవీలు, కెమెరాలు, పవర్ బ్యాంక్లు.. ఇలా మరో 23 ఇక చౌక
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ-గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అమలవుతున్నప్పటి నుంచి ప్రజల కోసం 28 శాతం స్లాబ్ నుంచి క్రమంగా పలు వస్తువులను తక్కువ స్లాబ్లోకి తీసుకు వస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా మరోసారి ప్రజలకు ఊరటనిచ్చింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలను ప్రజలకు చౌక ధరకు అందించే స్లాబ్లో ఉంచింది. ఆ తర్వాత పలు వస్తువులను తక్కువ స్లాబ్లోకి తెచ్చింది.
తాజాగా, మధ్య తరగతికి ఊరట కలిగించే మరో నిర్ణయం తీసుకుంది జీఎస్టీ మండలి. సినిమా టిక్కెట్లు, 32 అంగుళాల వరకు టీవీలు, పవర్ బ్యాంకులు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్స్, వీడియో గేమ్స్ తదితర 23 వస్తువుల పన్నుల భారం తగ్గించింది. రవాణా రంగానికీ మేలు కలిగించే నిర్ణయాలు తీసుకుంది.
విలసవంత వస్తువులే 28 శాతం స్లాబ్లో
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శనివారం జీఎస్టీ మండలి 31వ సమావేశం జరిగింది. ఇక మీదట 28 శాతం స్లాబ్లో విలాసవంతమైన వస్తువులే ఉంటాయని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం సిమెంట్పై 28 శాతం పన్ను ఉందని, దీనిపై పన్ను తగ్గిస్తే ఏటా రూ.13 వేల కోట్ల ఆదాయం తగ్గే అవకాశమున్నందున దీనిపై కొంత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి
తగ్గించిన పన్నులు జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం పన్నులు తగ్గిస్తున్నందువల్ల ఏటా రూ.5,500 కోట్ల ఆదాయం కోల్పోవలసి ఉంటుందన్నారు. సినిమా టిక్కెట్ల పైన పన్ను తగ్గింపు వల్ల రూ.900 కోట్లు, టీవీ స్క్రీన్లపై తగ్గింపు వల్ల రూ.1,500 కోట్ల ఆదాయం తగ్గుతుందని తెలిపారు.
ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల ఆదాయం పెరిగింది
జీఎస్టీ ద్వారా 12 రాష్ట్రాల ఆదాయం పెరిగిందని అరుణ్ జైట్లీ తెలిపారు. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉన్నాయని చెప్పారు. జీఎస్టీ అమలు కారణంగా ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలపై అధ్యయనం చేయడానికి ఏడుగురు మంత్రులతో బృందాన్ని ఏర్పాటు చేసింది. పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ల ఆదాయం పడిపోయింది. మధ్యప్రదేశ్, త్రిపురల ఆదాయం కూడా తగ్గింది. కేరళ, గుజరాత్ ఆదాయాల్లో మార్పుల్లేవు. బీహార్ ఆదాయం గణనీయంగా 18% పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ఆదాయం పెరిగింది.
పన్ను భారం తగ్గిన మొత్తం వస్తువులు ఇవే, 28 శాతం నుంచి 18 శాతానికి
పన్ను భారం తగ్గిన వస్తువులు కంప్యూటర్ మానిటర్, 32 అంగుళాల వరకు టీవీలు, రీ ట్రీటెడ్ లేదా ఉపయోగించిన రబ్బర్ టైర్లు, పుల్లీలు, ట్రాన్స్ మిషన్ షాఫ్ట్స్ క్రాంక్స్, గేర్ బాక్సులు వంటి వాటిపై 28 శాతం నుంచి 18 శాతం శ్లాబ్లోకి వచ్చాయి. వస్తువులు రవాణా చేసే వాహనాలపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంపై విధిస్తున్న జీఎస్టీ 18 శాతం నుంచి 12 శాతం స్లాబ్లోకి తగ్గించారు.
28 శాతం నుంచి 12 శాతం తగ్గిన వస్తువులు
రూ.100 వరకు సినిమా టిక్కెట్లు, బెండు ముడి సరుకు, బెండుతో చేసిన వస్తువులు, మిశ్రమ బెండు తదితర వస్తువులు 12 శాతానికి తగ్గాయి. ఇక పాలరాతి ముక్కలు, సహజసిద్ధ బెండు, చేతి కర్ర, ఫ్లైయాష్ బ్లాక్స్ 18 శాతం లేదా 12 శాతం స్లాబ్ నుంచి 5 శాతం స్లాబ్లోకి వచ్చాయి. సౌర విద్యుత్, ఇతర ఇంధన ఉత్పత్తి పరికరాలపై 5 శాతం జీఎస్టీ రేట్ అమలవుతుంది. సంగీతం పుస్తకాలు, కూరగాయలు (రసాయనాల ద్వారా నిల్వ చేసినవి) 12 లేదా 5 శాతం స్లాబ్ నుంచి 0 స్లాబ్లోకి వచ్చాయి. అంటే వీటిపై జీఎస్టీ ఉండదు. చార్టర్ విమానాల్లో తీర్థయాత్రలకు వెళ్లేవారికి ఎకానమీ క్లాస్ తరహాలోనే 5 శాతం వర్తింపజేస్తారు.
28 శాతం స్లాబు నుంచి ఏడాదిన్నరలో 191 వస్తువులు తొలగించారు
గత ఏడాది (2018) జులై1 జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు 28% స్లాబులో 226 వస్తువులు ఉన్నాయి. క్రమంగా వాటి సంఖ్య తగ్గించారు. ఏడాదిగా 191 వస్తువులను ఆ స్లాబు నుంచి తొలగించారు. ప్రస్తుతం ఉన్నత వర్గాలు ఉపయోగించే 28 వస్తువులు మాత్రమే ఉన్నాయి. విలాసంతమైన ఏసీలు, డిష్ వాషర్లు వంటివి, హానికరమైన వస్తువులను మాత్రమే ఈ స్లాబులో ఉంచారు. ఆటో మొబైల్ రంగానికి చెందిన 13 వస్తువులు, సిమెంట్ రంగానికి చెందిన 8 వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి.