జిఎస్టీ శుభవార్త, 30 వస్తువులపై తగ్గుదల: జూలై రిటర్న్ దాఖలుకు గడువు
జిఎస్టీ కారణంగా ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు శుభవార్త. 30 రకాల వస్తువుల జీఎస్టీ ధరలు తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్/న్యూఢిల్లీ: జిఎస్టీ కారణంగా ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు శుభవార్త. 30 రకాల వస్తువుల జీఎస్టీ ధరలు తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
వీటిలో పెరుగు పొడి, ఇడ్లీ/దోశ పిండి, చింతపండు, రెయన్ కోట్స్, రబ్బర్ బ్యాండ్లు తదితర వస్తువులున్నాయి. ఇక ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) స్టోర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం తెలిపారు. హైదరాబాద్లో ఆధ్వర్యంలో 21వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జిఎస్టీఆర్ 1 ఫిల్లింగ్
రిటర్నుల దాఖల్లో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సవరణ షెడ్యూలు ఆమోదించింది. 2017 జులై నెలకు సంబంధించి జీఎస్టీఆర్ 1 దాఖలుకు అక్టోబరు 10 వరకూ గడువు ఇచ్చారు. జీఎస్టీఆర్ 2 దాఖలుకు అక్టోబరు 31 వరకు, జీఎస్టీఆర్ 3 దాఖలుకు నవంబరు 30 వరకూ గడువు పొడిగించారు. ఆగస్ట్ నుంచి డిసెంబరు వరకు రిటర్నులు దాఖలు చేసేందుకు జీఎస్టీఆర్ 3బీ ఫారాన్ని కొనసాగిస్తారు. జీఎస్టీలో నమోదైన వ్యక్తి కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకోనివారికి 30 సెప్టెంబరు వరకు అవకాశమివ్వనున్నారు. ఇందులో రిజిస్టరు చేసుకున్నవారికి మాత్రమే అక్టోబరు 1 నుంచి కాంపోజిషన్ పథకం ప్రయోజనాలు అందిస్తారు.
ధరలు తగ్గించేవి ఇవి!
వేయించిన పప్పులు, చింతపండు, ఇడ్లీ, దోసె పిండి, కస్టర్డ్ పొడి, ఆయిల్ కేక్లు, అగరబత్తీలు, ప్లాస్టిక్ రెయిన్ కోట్లు, రబ్బర్ బ్యాండ్లు, కంప్యూటర్ మానిటర్లు, కిచెన్ గ్యాస్ లైటర్లు, చీపుర్లు, బ్రష్లు తదితర వస్తువుల ధరలు తగ్గుతాయి. తద్వారా ప్రజలు నిత్యం వినియోగించే మరో 30 వస్తువులపై జిఎస్టీని తగ్గించారు.
చిన్న కార్లపై అదనపు భారం లేదు
మధ్యరకం కార్లు, విలాసవంతమైన కార్లు, ఎస్యూవీలపై సెస్ను పెంచడంతో ఆ కార్ల ధరలు పెరగనున్నాయి. సీటింగ్ సామర్థ్యం 10 నుంచి 13 శాతం వరకూ ఉన్నవాటికి, హైబ్రీడ్ కార్లపై జీఎస్టీలో ఎలాంటి మార్పు లేదు. చిన్నకార్లపై అదనపు భారం ఉండబోదని జైట్లీ తెలిపారు.
వారికి రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు
రూ.20 లక్షల్లోపు లావాదేవీలు చేసి ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకునే చేతివృత్తుల వారికి జీఎస్టీఎన్ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించి ఇచ్చింది. వర్క్ కాంట్రాక్ట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి గతంలో తగ్గించగా తాజా సమావేశంలో వాటిపై మండలి స్పష్టత ఇచ్చింది.
రాబడి బాగుంది
జీఎస్టీ ద్వారా రాబడి చాలా బాగుందని జైట్లీ చెప్పారు. 70 శాతం వరకూ పన్ను వసూలు అయిందన్నారు. ఇప్పటి వరకూ రిటర్న్లు దాఖలు చేసినవారు రూ.95 వేల కోట్ల పన్ను జమ చేశారని, మూడు సందర్భాల్లో జీఎస్టీఎన్ మొరాయించిందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో విక్రయించే ఆహారం పదార్థాలపై ఎలాంటి పన్ను లేదన్నారు. బ్రాండెడ్ అయితే ఐదు శాతం పన్ను వర్తిస్తుందని చెప్పారు. జీఎస్టీఎన్ నెట్వర్క్, ఐటీ సమస్యలు, రిటర్న్ల దాఖలతో ఎదురవుతున్న ఇబ్బందుల సమీక్షించేందుకు అధికారుల కమిటీతో బాటు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నిత్యావసరాలపై తగ్గుదల
జీఎస్టీ నేపథ్యంలో వివిధ వస్తువుల పన్నులను నిర్ణయించేటపుడు గతంలో ఉన్న రేట్లకు దగ్గరగా సర్దుబాటు చేసినట్లు జైట్లీ తెలిపారు. ప్రజలు నిత్య జీవితంలో ఉపయోగించే సుమారు 65 వస్తువులపై ఎలాంటి జీఎస్టీ విధించలేదన్నారు. తాజాగా ధరల సర్దుబాటు నేపథ్యంలో 30 వస్తువుల జీఎస్టీని తగ్గించినట్లు చెప్పారు.