జీఎస్టీ పుణ్యమాని.. మాల్స్కు పండుగ : దివాళీ వచ్చిందా అన్నట్లు కళకళ..
శుక్రవారం ఒక్కరోజే 12శాతం మేర సేల్స్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్ అన్నింటిలోను ఇదే రద్దీ కొనసాగడంతో.. చాలావరకు వ్యాపారాలు ఈ ఒక్క నెలలోనే మంచి లాభాలను చవిచూశాయి.
న్యూఢిల్లీ: 'సీజన్' అయితే తప్ప జనం కిటకిటలాడేంత రద్దీ మాల్స్ లో కనిపించడం అరుదు. కానీ జీఎస్టీ పుణ్యమాని దేశంలోని చాలా మాల్స్ కు ఊహించని 'సీజన్' వచ్చింది. జీఎస్టీ తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ పై ధరలు పెరగనున్న నేపథ్యంలో.. జూలై 30రాత్రి వరకు మాల్స్ అన్ని కళకళలాడాయి. కస్టమర్ల శోభతో క్యాష్ కౌంటర్లన్ని కిక్కిరిసిపోయాయి.
అసలేమిటీ జీఎస్టీ? వినియోగదారుడికి అంతిమంగా లాభమా? నష్టమా?
ఎలక్ట్రానిక్ రిటైల్ మాల్స్ లో జనం భారీ ఎత్తున బారులు తీరు మరీ కనిపించడం గమనార్హం. మొత్తం మీద జీఎస్టీ ప్రభావంతో గత రెండు రోజుల్లో 20శాతం మేర మాల్స్ లో రద్దీ పెరిగిందని పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ దెబ్బతో ఒక్కసారిగా వారి బిల్లింగ్ సైకిల్ సగటు కూడా 30శాతానికి ఎగబాకింది. కొన్ని మాల్స్, షోరూంలు గతేడాది కంటే 100-200శాతం అధికంగా విక్రయాలు జరిపినట్లు ప్రకటించాయి.
మాల్స్ కిక్కిరిసి:
ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో గృహోపకరణాలైన వాషింగ్ మెషీన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు కొనుగోలు చేయడానికే కస్టమర్లు ఎక్కువ మొగ్గుచూపారని తెలుస్తోంది. గురువారం, శుక్రవారాల్లో తమ క్యాష్ కౌంటర్లు భారీగా కిక్కిరిసిపోయాయని రియలన్స్ డిజిటల్ సీఈవో బ్రియన్ బాడే తెలిపారు. సాధారణంగా దివాళీ లేదా ధన్ తేరాస్ రోజు ఇంత రద్దీని చూస్తామని, కానీ జీఎస్టీ ప్రభావంతో.. ఆ రద్దీని ఇప్పుడే చూశామని హర్షం వ్యక్తం చేశారు.
పండుగల కన్నా ఎక్కువ రద్దీ!:
ధన్తేరాస్ రోజు కంటే ఎక్కువగా గురు, శుక్రవారాల్లో మాల్స్ లో రద్దీ నమోదైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆయా కంపెనీలు ఆఫర్లను ప్రకటించడం కూడా ఈ రద్దీకి కారణంగా తెలుస్తోంది. జీఎస్టీ అమలుతో ముగిసిన సేల్ సీజన్లో ఫ్యాషన్, లైఫ్స్టయిల్ రిటైలర్లు అదనపు డీల్స్ కూడా ఆఫర్ చేశారు. శుక్రవారం అర్థరాత్రి వరకు ఈ ఆఫర్ల పర్వం కొనసాగింది.
ఆఫర్లు, వీకెండ్, కలిసొచ్చాయి:
జీఎస్టీ వస్తే పన్నుపోటు తప్పదు కాబట్టి.. ఆలోపే తమకు కావాల్సిన ఎలక్ట్రానిక్స్ వస్తువులను విక్రయించడానికి జనం మాల్స్ వైపు క్యూ కట్టారు. ఇందుకు తగ్గట్లు మాల్స్ కూడా ఆఫర్లను ప్రకటించడం కలిసొచ్చింది. దీంతో ఈ ఒక్క నెలలోనే రిటైల్ వ్యాపారాలు 30శాతం మేర వృద్దిని నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా చివరి 15రోజుల్లో ఈ విక్రయాలు మరింత ఊపందుకున్నాయని, వీకెండ్, ఈద్ ఫెస్టివల్ కూడా ఇందుకు కలిసొచ్చాయని సిటీ వాక్ డైరెక్టర్ యోగేశ్వర్ శర్మ అన్నారు.
ఒక్క శుక్రవారమే 12శాతం:
శుక్రవారం ఒక్కరోజే 12శాతం మేర సేల్స్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్ అన్నింటిలోను ఇదే రద్దీ కొనసాగడంతో.. చాలావరకు వ్యాపారాలు ఈ ఒక్క నెలలోనే మంచి లాభాలను చవిచూశాయి. మొత్తం మీద స్వతంత్ర భారత చరిత్రలో జీఎస్టీ మరో పన్ను శకానికి నాంది పలికిందనే చెప్పాలి.