జీఎస్టీ: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ కంపెనీలు ధరలు పెంచవట!
జీఎస్టీ ప్రభావంతో రేపటి నుంచి మొబైల్ ధరలు పెరగనున్న నేపథ్యంలో శాంసంగ్, షియోమీ, ఒప్పో, జియోనీ, ఇంటెక్స్, లావా కంపెనీలు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి.
న్యూఢిల్లీ: జీఎస్టీ ప్రభావంతో రేపటి నుంచి మొబైల్ ధరలు పెరగనున్న నేపథ్యంలో శాంసంగ్, షియోమీ, ఒప్పో, జియోనీ, ఇంటెక్స్, లావా కంపెనీలు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి.
జీఎస్టీ కారణంగా పెరగనున్న ధరలను ఆయా కంపెనీలే భరించాలని నిర్ణయించాయి. ఫలితంగా ఆ కంపెనీల ఫోన్లపై జీఎస్టీ ప్రభావం లేనట్టే. జీఎస్టీ ప్రభావం తమ కంపెనీ ఫోన్లపై పడదని జియోనీ మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ వోహ్రా తెలిపారు.
చైనాకు చెందిన షియోమీ, ఒప్పోతోపాటు భారత్కు చెందిన లావా కూడా మొబైల్ రేట్లను పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. తమ కంపెనీ ఉత్పత్తుల కొనుగోలును పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ గౌరవ్ నిగమ్ తెలిపారు.
సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కూడా రేట్లు పెంచేందుకు విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడళ్ల ధరలను పెంచకుండా కొత్త వాటిపై మాత్రం జీఎస్టీకి అనుగుణంగా 12 శాతం పెంచాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయమై శాంసంగ్ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.
ఇక ఇంటెక్స్ టెక్నాలజీస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రాజీవ్ జైన్ మాట్లాడుతూ కొత్త ఫోన్ల ధరలు మాత్రమే పెరుగుతాయని చెప్పుకొచ్చారు. అంటే ప్రస్తుతం ఉన్న మోడళ్లపై ధరలు పెరగవని చూచాయగా పేర్కొన్నట్లే. అయితే మైక్రోమ్యాక్స్ మాత్రం జీఎస్టీపై మాట్లాడేందుకు నిరాకరించింది.