ఆదాయం వృద్ధి పై ఫోకస్: జీఎస్టీ స్ట్రక్చర్ను పునఃసమీక్షించనున్న కౌన్సిల్
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)పై కేంద్రం పునఃసమీక్ష చేయనుందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. డిసెంబర్ 18వ తేదీన జీఎస్టీ సమాఖ్య సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ సమావేశంలో కొన్ని మినహాయింపు ఉన్న వస్తువులను పరిగణలోకి తీసుకోనుంది జీఎస్టీ కౌన్సిల్. జీఎస్టీ , పరిహారం చెల్లించేందుకు సుంకం రేట్లు మరియు రెవిన్యూ పెరుగుదలకు కావాల్సిన చర్యలు తీసుకోనుంది జీఎస్టీ కౌన్సిల్. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇన్పుట్స్ను ఇవ్వాలని జీఎస్టీ సెక్రటేరియట్ కోరింది.
కేంద్రానికి షాక్: భారీగా తగ్గిన జీఎస్టీ ఆదాయం! ఎంతంటే.?
రెవిన్యూ పెరుగుదలపైనే ఫోకస్
ఇక సమావేశంలో ఇప్పటికే ఉన్న వస్తువులపై జీఎస్టీ, ఇప్పటి వరకు జీఎస్టీ కిందకు రాని వస్తువులపైతో పాటు ఇతర అంశాలపై కూడా జీఎస్టీ సమాఖ్య పరిగణలోకి తీసుకోనుంది. రెవిన్యూ పెరుగుదలకు కావాల్సిన ఇన్పుట్స్ను ప్రతిపాదనలను తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు సూచనలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నవంబర్ 27న ఆయా రాష్ట్రప్రభుత్వాలకు రాసిన లేఖలో పేర్కొంది. కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారంలో జాప్యం జరుగుతుండగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదు చేయడంతో జీఎస్టీ తాజా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. పండగ సీజన్ తర్వాత జీఎస్టీ కలెక్షన్లు 6శాతం పెరుగుతూ నవంబర్ నెలకు రూ.1,03,492 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
పరిహారం చెల్లించేందుకు సుంకం పెంపు
గత కొన్ని నెలలుగా జీఎస్టీ పరిహారం సెస్ వసూళ్లు తక్కువగా కావడం ఆందోళన కలిగిస్తోందని లేఖలో జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది. చెల్లించాల్సిన పరిహారం పెరుగుతోందని అయితే సెస్ రూపంలో పరిహారం వసూలు చేయడం మాత్రం తగ్గుతోందని జీఎస్టీ సమాఖ్య పేర్కొంది. ఇదిలా ఉంటే జీఎస్టీ రేట్లను సింప్లిఫై చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నవంబర్ 30న ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
నిత్యావసర వస్తువులపై తగ్గనున్న జీఎస్టీ
జీఎస్టీ ట్యాక్సేషన్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో , తక్కువగా ఎక్కడుందో వాటన్నిటినీ సమీక్షించి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వీలైనంత తక్కువగా విధించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిగతా వస్తువులపై జీఎస్టీని క్రమబద్ధీకరణ చేస్తామని వెల్లడించారు. అదే సమయంలో కేంద్రం ఆదాయ వృద్ధిపై కూడా దృష్టి సారిస్తుందని చెప్పారు.
జీఎస్టీ మినహాయింపులో ఉన్న వస్తువులపై దృష్టి
ఇక డిసెంబర్ 18న జరిగే జీఎస్టీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని డెలాయిట్ పార్ట్నర్ ఎంస్ మణి చెప్పారు. ఇందులో భాగంగా సుంకంను పెంచి తద్వారా వచ్చే డబ్బులను ఆయా రాష్ట్రాలకు పరిహారంగా చెల్లించే యోచనలో కేంద్రం ఉన్నట్లు చెప్పారు. ఇక ఆదాయం పెంచుకునేందుకు జీఎస్టీ మినహాయింపులో ఉన్న కొన్ని వస్తువులపై జీఎస్టీ విధించే అవకాశం ఉందని చెప్పారు. ఇక జీఎస్టీపై వచ్చిన ఫిర్యాదులతో గతేడాది కొన్ని చర్యలను తీసుకుంది కేంద్రం. ఇందులో భాగంగానే పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించింది. అయితే విద్య, హెల్త్ కేర్ రంగాలపై జీఎస్టీ విధించడం తప్ప మరే వస్తువులను జీఎస్టీ కిందకు తీసుకొచ్చే అవకాశం లేదని జాతీయ పరోక్ష పన్నుల నేత ప్రతీక్ జైన్ చెప్పారు.